సొంత బిడ్డలా చూసుకుంటూ..!
ABN , First Publish Date - 2021-12-07T07:06:36+05:30 IST
చికిత్స పొందుతున్న జషిత నందన్ సంరక్షణకు మహిళా కానిస్టేబుళ్లు శాంతి, నాగరత్నను నియమించారు.
తిరుపతి సిటీ, డిసెంబరు 6: చికిత్స పొందుతున్న జషిత నందన్ సంరక్షణకు మహిళా కానిస్టేబుళ్లు శాంతి, నాగరత్నను నియమించారు. వీరు తమ సొంత బిడ్డలా పాపను చూసుకుంటున్నారు. నిద్రలోనూ పాప ఉలిక్కి పడుతూ భయపడుతోంది. ‘జో కొట్టండి’ అని పాప అడుగుతుండటంతో వారు జో కొడుతూనే ఉంటున్నారు. చికిత్స అందించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ఎవరు వచ్చినా పాప భయపడుతుండటంతో, ఆమెను ఓదారుస్తూ వైద్య సేవలను కొనసాగిస్తున్నారు. కాగా, శాంతి ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నారికి తోడుగా ఉండగా.. రాత్రిపూట నాగరత్న విధుల్లోకి వచ్చారు.
బిడ్డతో కలిసి విధి నిర్వహణకు.. :
చంద్రగిరి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ వై.నాగరత్న తన నాలుగేళ్ల కుమారుడితో వచ్చి జషిత నందన్కు తోడుగా ఉంటున్నారు. ఈమె నివాసం చంద్రగిరి. భర్త పలమనేరులో అటవీశాఖ ఉద్యోగి. సెలవు దినాల్లో ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో ఇంటి వద్ద నాలుగేళ్ల కుమారుడు ఒక్కడినే ఉంచలేని పరిస్థితి. దీంతో తన కుమారుడిని ఒళ్లో కూర్చొబెట్టుకొని, మరో చేత్తో పాపను జో కొడుతూ తల్లి బాధ్యతలను నెరవేరుస్తోంది.