లాగే గుర్రాలను పక్కనపెట్టి.. తన్నే గుర్రాలకు పదవులు
ABN , First Publish Date - 2022-07-01T09:19:10+05:30 IST
లాగే గుర్రాలను పక్కనపెట్టి.. తన్నే గుర్రాలకు పదవులు
విశాఖ జిల్లా ప్లీనరీలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ వ్యాఖ్యలు
విశాఖపట్నం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): వైసీపీలో లాగే గుర్రాలను పక్కనపెట్టి, తన్నే గుర్రాలకు పదవులు కట్టబెడుతున్నారని టీడీపీ నుంచి వైసీపీ పంచన చేరిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్కుమార్ అసంతృప్తి వ్యక్తంచేశారు. టీటీడీ చైర్మన్, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, ఇన్చార్జి మంత్రి విడదల రజని సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వైసీపీ విశాఖ జిల్లా ప్లీనరీని గురువారం సిరిపురంలోని గురజాడ కళాక్షేత్రంలో నిర్వహించారు. ప్లీనరీలో వాసుపల్లి గణేశ్ మాట్లాడుతూ ‘కార్యకర్తల్లో కూడా లాగే గుర్రాలు, తన్నే గుర్రాలు ఉంటారు. లాగే గుర్రాలు కన్నెలు వేసుకుని పార్టీని లాగుతూనే ఉన్నారు. మరి తన్నే గుర్రాలేమో ఫైళ్లను చంకనపెట్టుకుని నాయకుల వెంట తిరుగుతూ పదవులు మేసేస్తున్నారు’ అంటూ వేదికపై ఉన్న నేతలవైపు చేయి చూపించడంతో వారంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. ప్లీనరీకి వచ్చిన జనం లో చాలామంది కార్యక్రమం జరుగుతుండగానే బయటకు వెళ్లిపోయారు. దీంతో విడదల రజని, వైవీ సుబ్బారెడ్డి మాట్లాడే సమయానికి సగానికిపైగా సీట్లు ఖాళీగా దర్శనమిచ్చాయి.