ఒంటరి మహిళతో సహజీవనం చేసి.. చివరికిలా..
ABN , First Publish Date - 2020-11-05T13:41:48+05:30 IST
భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ
హైదరాబాద్/సైదాబాద్ : ఒంటరిగా ఉంటున్న ఓ మహిళను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడు ఓ వ్యక్తి. తాను అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వాలని, చెప్పినట్లు వినకపోతే వ్యక్తిగత వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక బాధితురాలు సైదాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ సైదాబాద్ ప్రాంతంలో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండేది. అదే ప్రాంతానికి చెందిన పసుపులేటి అమర్నాథ్ అలియాస్ అమర్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. తనకు వివాహమైన విషయం చెప్పకుండా ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఇద్దరూ సహజీవనం చేశారు. అతడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేది. ఆమె గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించాడు. అమర్కు వివాహం అయిందని, కుమారుడు ఉన్నాడని కొద్ది రోజుల తర్వాత ఆమెకు తెలియడంతో అతడిని నిలదీసింది. దీంతో ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. అమర్ చేసిన మోసాలను అతడి కుటుంబసభ్యుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేయమని కోరింది. వారు అతడికే వత్తాసు పలికారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.