Viral: ఏనుగును కాపాడిన లోకో పైలెట్లు

ABN , First Publish Date - 2021-08-26T17:25:24+05:30 IST

రైలు పట్టాలపైకి వస్తున్న ఏనుగును చూసిన ఇద్దరు లోకో పైలెట్లు వేగంగా నడుపుతున్న రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపి, దాన్ని రక్షించిన ఘటన...

Viral: ఏనుగును కాపాడిన లోకో పైలెట్లు

రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్

కోల్‌కతా (పశ్చిమబెంగాల్): అటవీప్రాంతంలోని రైలు పట్టాలు దాటుతుండగా వేగంగా వస్తున్న రైళ్లు ఢీకొని ఏనుగులు మరణించిన పలు ఘటనలు గుండెలను పిండేస్తుంటాయి. కాని రైలు పట్టాలపైకి వస్తున్న ఏనుగును చూసిన ఇద్దరు లోకో పైలెట్లు వేగంగా నడుపుతున్న రైలుకు ఎమర్జెన్సీ బ్రేక్ వేసి ఆపి, దాన్ని రక్షించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని నాగరకత-చల్సా రైల్వేస్టేషన్ల మధ్య అటవీప్రాంతంలో కాంచన్ కన్యా ఎక్స్‌ప్రెస్‌ను లోకోపైలెట్లు డి దొరై, పి కుమార్ లు నడుపుతున్నారు. అంతలో అటవీ ప్రాంతంలో రైలు పట్టాలపైకి ఓ ఏనుగు రావడం లోకోపైలెట్లు చూశారు. అంతే రైలును నియంత్రించడానికి అత్యవసర బ్రేక్ వేశారు.


 దీంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది. ఎమర్జెన్సీ బ్రేక్ వల్ల రైలు ఆగడంతో ఏనుగు సురక్షితంగా అడవిలోకి వెళ్లింది.సకాలంలో రైలుకు బ్రేక్ వేసి ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకోపైలెట్లను నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ఏనుగులు రైళ్ల కింద పడి మరణించిన సందర్భాలు తమకు తెలుసని, కాని ఏనుగు ప్రాణాలు కాపాడిన లోకోపైలెట్లను పలువురు నెటిజన్లు అభినందించారు. ఏనుగు రైలు పట్టాలపైకి వచ్చిన వీడియోను రైల్వే డీఆర్ఎం సోషల్ మీడియాలో పోస్టు చేసి, లోకోపైలెట్లు ఏనుగు ప్రాణాలు కాపాడిన ఘటన గురించి చెప్పారు.

Updated Date - 2021-08-26T17:25:24+05:30 IST