Maharashtra: మాజీ హోంశాఖమంత్రి అనిల్ దేశ్ముఖ్కు లుకౌట్ నోటీసు
ABN , First Publish Date - 2021-09-06T15:32:17+05:30 IST
మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ముఖ్కు ఈడీ లుకౌట్ నోటీసు జారీ చేసింది....
న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, ఎన్సీపీ నాయకుడు అనిల్ దేశ్ముఖ్కు ఈడీ లుకౌట్ నోటీసు జారీ చేసింది.దేశ్ముఖ్ పై అవినీతి ఆరోపణలు, ఆర్థిక అక్రమాలు, మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా అతనికి లుకౌట్ నోటీసు జారీ చేసింది.ఈడీ కేసు నమోదుతో ఈ ఏడాది ఏప్రిల్లో మహారాష్ట్ర హోంశాఖ మంత్రి పదవికి దేశ్ముఖ్ రాజీనామా చేశారు. రూ.100 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఈడీ గతంలో అనిల్ దేశ్ముఖ్కు నోటీసు జారీ చేసింది.గతంలో ఈడీ పలు సమన్లు జారీ చేసినా దాటవేసినందున దేశ్ముఖ్ దేశం విడిచి వెళ్లకుండా నిరోధించడానికి లుకౌట్ సర్క్యులర్ ను ఈడీ జారీ చేసింది.
గత నెలలో ఈడీ కేసులో మాజీ మంత్రికి ఉపశమనం ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. రూ.100 కోట్ల లంచం ఆరోపణలపై సీబీఐ కూడా కేసు నమోదు చేసింది.ముంబై నగరంలోని బార్లు, రెస్టారెంట్ల నుంచి నెలకు రూ.100 కోట్లకు పైగా వసూలు చేయమని సస్పెండ్ అయిన పోలీసు అధికారి సచిన్ వాజీని అప్పటి రాష్ట్ర హోంమంత్రి అనిల్ కోరారని ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకి లేఖ రాశారు. దీనిపై ఏప్రిల్ 21 న బొంబాయి హైకోర్టు ఆదేశం ఆధారంగా దేశ్ముఖ్పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.