పోలవరంలో శివలింగం పరిశీలన

ABN , First Publish Date - 2022-05-20T05:32:45+05:30 IST

పోలవరం ప్రాజెక్టు తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాన్ని కాకినాడ పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.తిమ్మరాజు, తహసీల్దారు బి.సుమతి గురువారం పరిశీలించారు.

పోలవరంలో శివలింగం పరిశీలన
శివలింగాన్ని పరిశీలిస్తున్న పురావస్తు అధికారులు, తహసీల్దార్‌ సుమతి

12,13 శతాబ్ధాలకు చెందినదిగా పురావస్తుశాఖ గుర్తింపు

పురావస్తు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తిమ్మరాజు

పోలవరం, మే 19 : పోలవరం ప్రాజెక్టు తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాన్ని కాకినాడ పురావస్తు శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.తిమ్మరాజు, తహసీల్దారు బి.సుమతి గురువారం పరిశీలించారు. శివలింగం బయటపడ్డ ప్రాంతంలో అవశేషాలను, ఇటుకలను పరిశీలించిన అనంతరం తిమ్మరాజు మాట్లాడుతూ శివలింగం పరిమాణం, ఆకృతి, రాతి వినియోగాలను బట్టి 12,13 శతాబ్ధాలకు చెందినవిగా భావిస్తున్నట్లు తెలిపారు. పరిశీలనాంశాలను పురావస్తుశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్ళి తవ్వకాలు జరిపేందుకు కృషిచేయనున్నట్లు తెలిపారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపితే పురాతన విగ్రహాలు, గత చరిత్రల శాసనాలు బయటపడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. 1996 సంవత్సరంలో పైడిపాక గ్రామంలో తాము తవ్వకాలు చేసిన నేపథ్యంలో 2వ శతాబ్ధానికి చెందిన బౌద్ధ బిక్షువుల కాలం నాటివిగా భావిస్తున్న దేవతల విగ్రహాలు, శిఽథిలావస్థకు చేరిన ఆలయాల అవశేషాలు కనుగొనడం జరిగిందని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన తరువాత తవ్వకాలు నిలిపివేశామన్నారు. 1996 నుంచి 2002 వరకు పోలవరం ప్రాజెక్టు ఎగువన ఉన్న వేలేరుపాడు మండలం రుద్రమకోట, కౌండిన్యముక్తి, ఎటపాక మండలం రాయునిపేట గ్రామాల నుంచి తూటిగుంట చీడూరు, శివగిరి ప్రాంతాలలో తవ్వకాలు, 800 గ్రామాల్లో సర్వే నిర్వహించామన్నారు. నిధుల కొరత వలన తవ్వకాలు, పరిశోధనలు నిలిపివేశామన్నారు. తవ్వకాల్లో బయటపడ్డ విగ్రహాలను ఆలయాల అవశేషాలను రాజమహేంద్రవరం పురావస్తుశాఖ మ్యూజియంలో భద్రపరచామని బయటపడ్డ శివలింగాన్ని, ఆలయాల అవశేషాలను కూడా అక్కడికే తరలించనున్నట్లు తెలిపారు. వర్షాల సీజను రాకమునుపే శివలింగం బయటపడ్డ ప్రాంతంలో తవ్వకాలు జరిపే విషయంలో ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీరుతో మాట్లాడనున్నట్లు తెలిపారు. వర్షాల సీజను వస్తే ఆ ప్రాంతం మీదుగా స్పిల్వేలోకి వరద జలాలు ప్రవహిస్తాయని నీటి తాకిడికి వరవడికి ఆ ప్రాంతంలోమట్టి కొట్టుకుపోయే అవకాశాలున్నాయన్నారు. తవ్వకాలు జరిపితే మరిన్ని మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎగువన బయటపడ్డ పురాతన విగ్రహాలు, ఆలయాల అవశేషాలతో పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ఐదెకరాల విస్తీర్ణంలో మ్యూజియం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం జరిగిందని తెలిపారు. 


Updated Date - 2022-05-20T05:32:45+05:30 IST