చెట్టును ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
ABN , First Publish Date - 2021-01-24T04:46:46+05:30 IST
చెట్టును ఢీకొన్న లారీ.. డ్రైవర్ మృతి
క్యాబిన్లో ఇరుక్కున్న క్లీనర్.. కాపాడిన పోలీసులు
బచ్చన్నపేట, జనవరి 23: క్లీనర్ అతివేగంగా లారీని నడపడంతో బచ్చన్నపేట సమీపంలోని కొడవటూరు కమాన్ వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ మృతి చెందగా, క్లీనర్ను పోలీసులు కాపాడారు. ఎస్సై లక్ష్మణ్రావు తెలిపిన ప్రకారం... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం కొప్పులపల్లికి చెందిన గౌడి రాజు(27) చేగుంటలో లారీపై డ్రైవర్గా పనిచేస్తున్నాడు. చేగుంటలో శుక్రవారం రాత్రి లారీలో కోళ్ల దాణా నింపుకుని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేటకు వెళ్తుండగా కొడవటూరు కమాన్ వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. క్లీనర్ దేవునూరి మల్లేశ్ లారీని నడిపాడని తెలిపారు. క్యాబిన్ నుజ్జునుజ్జు కాగా, క్లీనర్ ఇరుక్కుపోవడంతో ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై, సిబ్బంది మూడు గంటలు శ్రమించి బయటకు తీశారు. అతని కాళ్లకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ రాజు తండ్రి పోచయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.