జోరుగా ఫీవర్‌ సర్వే

ABN , First Publish Date - 2022-01-22T05:38:49+05:30 IST

జోరుగా ఫీవర్‌ సర్వే

జోరుగా ఫీవర్‌ సర్వే
వికారాబాద్‌ : గిరిగేట్‌పల్లిలో ఫీవర్‌ సర్వేను పరిశీలిస్తున్న వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌

వికారాబాద్‌/నవాబుపేట/ధారూరు/తాండూరు/యాలాల/పరిగి/మేడ్చల్‌/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌/ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర/కీసర రూరల్‌ జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆదేశాల మేరకు వికారాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో వైద్యశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జ్వర సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశావర్కర్లు, ఏఎన్‌ఎంలు, పంచాయితీ కార్యదర్శులు, రెవెన్యూ, మునిసిపల్‌, గ్రామపంచాయతీ సిబ్బంది బృందాలుగా ఏర్పడి సర్వే చేశారు. మొదటిరోజు నిర్వహించిన సర్వేలో ప్రజలకు జ్వరం, దగ్గు, జలుబు, తదితర లక్షణాలు ఉంటే వారికి తగిన మందులు అందజేశారు. జ్వరం లక్షణాలు ఎక్కువగా ఉన్నవారికి మెడికల్‌ కిట్లు పంపిణీ చేశారు. కాగా, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని గిరిగేట్‌పల్లిలో నిర్వహించిన ఫీవర్‌ సర్వేలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు మూఢ నమ్మకాలతో ఇప్పటివరకు కరోనా టీకా తీసుకోకుండా ఉంటే అపోహలకు పోకుండా నిర్భయంగా టీకా తీసుకోవాలన్నారు. అందుకు వైద్య సిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఆశావర్కర్లు ఇంటింటికీ వెళ్లి జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారిని గుర్తించి ఏఎన్‌ఎంలకు జాబితాను అందించాలన్నారు. కరోనా లక్షణాలతో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారికి ఏఎన్‌ఎంలు ప్రత్యేక మందులు, కిట్లు ఇంటికి వెళ్లి అందించాలన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పరీక్షలు, మందులు, వాక్సినేషన్‌ పంపిణీ ప్రజలకు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ శంషాద్‌బేగం, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నవాబుపేట మండల పరిధిలోని గంగ్యాడ, నారెగూడ, పూలపల్లి తదితర గ్రామాల్లో ఆశావర్కర్లు, వైద్యసిబ్బంది ఇంటింటి సర్వే, కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ బుచ్యయ్య ఆయా గ్రామాల్లో జ్వర సర్వేను పరిశీలించారు. మండలంలో 1062 కుటుంబాలను సర్వే చేశారని, 72 మందికి జ్వర లక్షణాలన్నట్లు గుర్తించారని, 62 మందికి కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఆశావర్కర్లు, వైద్యసిబ్బంది, సర్పంచులు పర్మయ్య, నర్సింహారెడ్డి, గోవిందమ్మ, సూపర్‌వైజర్‌ జంగయ్య, ఆర్‌ఐ తదితరులున్నారు. అలాగే ధారూరు మండలంలోని పలు గ్రామాలలో సర్వే నిర్వహించారు. ధారూరు పీహెచ్‌సీ పరిధిలో 4064 ఇళ్లు ఉండగా 23 వైద్యబృందాలు 559 ఇళ్లకు వెళ్లి సర్వే వివరాలు నమోదు చేశారు. 69 మంది జ్వరపీడితులను గుర్తించి హోం ఐసోలేషన్‌ కిట్‌లను అందజేసినట్లు వైద్యాధికారి రాజు తెలిపారు. అదేవిధంగా పరిగి నియోజకవర్గ పరిధిలోని పరిగి,దోమ, కులకచర్ల, పూడూరు, చౌడాపూర్‌ మండలాల్లో సర్వేను చేపట్టారు. ఐదు మండలాల్లో కలిపి 7381 ఇళ్ళను సందర్శించి 36,816 మందిని కలిసి ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. 173 మందికి జ్వరం లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. 34 మందికి మెడికల్‌ కిట్లను అందజేశారు. పరిగి మండలంలో 2320 ఇళ్ళను తిరిగి 10820 మందితో మాట్లడగా, 58 మంది జ్వర లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. దోమ మండలంలో 1232 ఇళ్లలో 7500మందికి గాను 22 మందికి జ్వరం ఉన్నవారిని గుర్తించారు. పూడూరు మండలంలో 1581 ఇళ్లలో 8842 మందిని కలిసి 46 మందిని గుర్తించారు. కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల్లో 1966 ఇళ్లను సందర్శించి 9854 మందిలో 47 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. పరిగి, దోమ, పూడూరు, కులకచర్ల, చౌడాపూర్‌ మండలాల పరిధిలో శుక్రవారం 327 మందికి కరోనా పరీక్షలు చేయగా, 41 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. కొడంగల్‌ మండలం పర్సాపూర్‌లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి సర్వే నిర్వహించి కరోనా లక్షణాలున్నవారికి హోం ఐసోలేషన్‌ కిట్లు, మందులు పంపిణీ చేశారు. సర్పంచ్‌ సయ్యద్‌అంజద్‌, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు గ్రామస్తుల ఆరోగ్య పరిస్థితులపై సర్వే నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు అంజిలమ్మ, ఆశాకార్యకర్తలు సుజాత, వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శి కల్పన తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు మున్సిపల్‌ పరిధిలోని 36 వార్డుల్లో 36 బృందాలుగా ఏర్పడి, వార్డుకు నలుగురు చొప్పున సర్వే చేశారు. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, వార్డు ప్రత్యేకాధికారులు,  మెప్మా, ఆర్పీలు, అంగన్‌వాడీ టీచర్లతో ఏర్పడిన బృందాలు సర్వేను చేపట్టి ప్రజల వివరాలను సేకరించారు. కొవిడ్‌ లక్షణాలున్న వారిని గుర్తించారు. తాండూరులో 16,309 ఇళ్లు ఉండగా, 657 ఇళ్లలో సర్వే చేశారు. 36 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి మందులు ఇచ్చారు. కాగా, యాలాల యాలాల మండలంలో 1213 కుటుంబాలను సర్వే చేయగా, 4,722 మందికి పరీక్షించారు. 45 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో..

మేడ్చల్‌ జిల్లాలో మొత్తం 819 టీంలు సర్వే చేశాయి. శామీర్‌పేట మండలంలో 20 టీంలు 721 గృహాల్లో సర్వే చేశాయి. 13 మందికి స్వలంగా జ్వరం ఉన్నట్లు గుర్తించారు. జ్వరం, దగ్గు, జలుబు, తదితర లక్షణాలు ఉన్న 13 మందికి మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. మూడుచింతలపల్లి మండలంలో 20 టీంలు 1679 గృహాల్లో సర్వే నిర్వహించాయి. 38 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 9 మందికి మెడికల్‌ కిట్లను అందజేశారు. కీసర మండలంలో 18 టీంలు 845 గృహాల్లో సర్వే చేశాయి. 35 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించి కిట్ల్లను అందజేశారు. అదేవిధంగా మేడ్చల్‌ మండలంలో 24 టీంలు 1442 గృహాల్లో సర్వేలో పాల్గొని 183 మందికి జ్వరం ఉన్నట్లుగా గుర్తించారు. 14 మందికి మెడికల్‌ కిట్లను అందజేశారు. మేడ్చల్‌ మునిసిపాలిటీలో 12 టీంలు 894 కుటుంబాలను సర్వే చేసి 94 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 24 మందికి మెడికల్‌ కిట్లను అందజేశారు. గుండ్లపోచంపల్లి మునిసిపాలిటీలో 14 టీంలు 927 కుటుంబాలను సర్వే చేసి 134 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 18 మందికి మెడికల్‌ కిట్లను పంపిణీ చేశారు. ఘట్‌కేసర్‌ మునిసిపాలిటీలో 18 టీంలు 1969 గృహాలను సర్వే చేయగా 147 మందికి జర్వం ఉందని గుర్తించారు. వారందరికీ కిట్లను పంపిణీ చేశారు. ఘట్‌కేసర్‌ మండలంలో 27 టీంలు 1603 గృహాలను సర్వే చేయగా 207 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 17 మందికి మెడికల్‌కిట్లను అందజేశారు. పోచారం మునిసిపాలిటీలో 18 టీంలు 1478 కుటుంబాలను సర్వే చేయగా 10మందికి జర్వం ఉండగా కిట్లను అందజేశారు. నాగారం మునిసిపాలిటీలో 20 టీంలు 1700 కుటుంబాలను సర్వే చేసి 17 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 21 మందికి తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు ఉండటంతో కిట్లను అందజేశారు. దమ్మాయిగూడ మునిసిపాలిటీలో 18 టీంలు 1416 కుటుంబాలను సర్వే చేసి 12 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. ఐదుగురికి కిట్లను అందజేశారు. అదేవిధంగా తూంకుంట మునిసిపాలిటీలో 10 టీంలు 1106 మంది కుటుంబాలను సర్వే చేయగా 45 మందికి జ్వరం ఉన్నట్లు గుర్తించారు. 23 మందికి మెడికల్‌ కిట్లను అందజేశారు.

Updated Date - 2022-01-22T05:38:49+05:30 IST