వారిది చాక్లెట్ కంపెనీలో మొదలైన ప్రేమ... ఉద్యోగం మానేశాక విరహం... ఆ యువకుడు ఆమె ఊరికి వచ్చి ఏం చేశాడంటే...
ABN , First Publish Date - 2022-08-03T14:52:12+05:30 IST
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో ...
ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ప్రియురాలితో పెళ్లి కోసం ఆమె కుటుంబ సభ్యులను ఒప్పించేందుకు ప్రియుడు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కాడు. ప్రియురాలిని తనతో పంపించాలని డిమాండ్ చేయడం మొదలు పెట్టాడు. ప్రేమికుడు ఎక్కిన వాటర్ ట్యాంక్ చుట్టూ స్థానికులు గుమిగూడారు. అందరూ అతన్ని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే అతను ఎవరి మాటా వినలేదు.
విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పలు ప్రయత్నాల అనంతరం ఆ యువకుడిని శాంతింపజేసి, సురక్షితంగా కిందకు దించారు. ఆ యువకుడు ముజఫర్నగర్ నివాసి అమన్ అని చెబుతున్నారు. అతని స్నేహితురాలు పాలియాలో ఉంటోంది. ఆమె ఇతర కులానికి చెందినది కావడంతో ఈ పెళ్లికి పెద్దలు నిరాకరించారు. అమన్ని ఆ యువతి ఢిల్లీలో కలుసుకుంది. వారిద్దరూ చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. ఈ నేపధ్యంలోనే వారిమధ్య సాన్నిహిత్యం పెరిగింది. కొద్ది రోజుల క్రితం ప్రియురాలు ఉద్యోగం మానేసి కుటుంబ సభ్యులతో కలిసి లఖింపూర్ ఖేరీకి తిరిగి వచ్చింది. అదే సమయంలో ప్రేమికుడు అమన్ కూడా ఉద్యోగం మానేసి ముజఫర్ నగర్ వెళ్లాడు. అయితే వారిద్దరూ ఫోన్లో మాట్లాడుకునేవారు. ఆ యువకుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు లఖింపూర్ ఖేరీ వచ్చాడు. ప్రియురాలి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకునేలా చేసేందుకు దాదాపు 2 గంటల పాటు అమన్ వాటర్ ట్యాంట్ ఎక్కి డ్రామా చేశాడు. చివరకు ప్రియురాలి తల్లి ఇద్దరి పెళ్లికి అంగీకరించిందని సమాచారం. అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లికి రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆయువకుడు ట్యాంక్పై నుంచి కిందకు దిగాడు. అనంతరం ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.