పక్కింటి అమ్మాయినే ప్రేమ పెళ్లి చేసుకున్నాడా కుర్రాడు.. ఊళ్లోంచి వాళ్లిద్దరూ వెళ్లిపోయాక జరిగిన దారుణమిది..!

ABN , First Publish Date - 2021-10-12T14:40:09+05:30 IST

హరియాణాలో ఒక ప్రేమ వ్యవహారం..

పక్కింటి అమ్మాయినే ప్రేమ పెళ్లి చేసుకున్నాడా కుర్రాడు.. ఊళ్లోంచి వాళ్లిద్దరూ వెళ్లిపోయాక జరిగిన దారుణమిది..!

హరియాణాలో ఒక ప్రేమ వ్యవహారం సంచలనంగా మారింది. రెవాడీ జిల్లాకు చెందిన ఒక యువకుడు తమ పక్కింటిలో ఉంటున్న ఒక యువతిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఫలితంగా ఆ యువకుని కుటుంబ సభ్యులు చిక్కుల్లో పడ్డారు. వారిపై దాడి జరిగింది. దాడిలో ఆ యువకుని తండ్రి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితులను ట్రామా సెంటర్‌కు తరలించారు. ఈ ఉదంతంపై ఆ యువకుని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


వివరాల్లోకి వెళితే రెవాడీ పట్టణానికి చెందిన ఒక చిరాగ్ అనే యువకుడు అక్టోబరు 8న అదే ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే ఇది ఆ యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో ఆ యువకుని కుటుంబ సభ్యులు పోలీసుల రక్షణ కోరారు. ఈ సందర్భంగా చిరాగ్ సోదరి చిత్ర మాట్లాడుతూ తాను ఇంటిలో ఉన్న సమయంలో ఆ యువతి సోదరుడు తనతో పాటు మరో పది మందిని ఇంటికి తీసుకువచ్చి, తన తండ్రి అమర్‌సింగ్‌పై దాడి చేశాడని తెలిపారు.


తన తల్లి రేఖ తన తండ్రిని కాపాడేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా కొట్టారని, అలాగే చిన్నాన్న, చిన్నమ్మలపై కూడా దాడి చేశారని తెలిపారు. సుమారు 20 నిముషాల పాటు వారు తమ ఇంటిలో అలజడి సృష్టించారన్నారు. ఆ తరువాత వారంతా పారిపోయారన్నారు. దీనికిముందు చిరాగ్ స్నేహితుడు గౌరవ్‌పై కూడా దాడిచేసి, అతని చేతులు, కాళ్లు విరగ్గొట్టారన్నారు. ఈ ఘటన గురించి గోకల్‌గేట్ పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జి షీషారామ్ మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు చిరాగ్, అతని భార్యను సేఫ్ హౌస్‌కు తరలించారన్నారు. బాధితులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2021-10-12T14:40:09+05:30 IST