ప్రేమజంట బలవన్మరణం

ABN , First Publish Date - 2022-05-27T05:54:56+05:30 IST

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవ టంతో మనస్థాపానికిగురై పురుగుమందు తాగి ఓ ప్రేమజంట బలవన్మరణం పొందిన సంఘటన పిడుగురాళ్ల సమీపంలో బుధవారం రాత్రి జరిగింది.

ప్రేమజంట బలవన్మరణం
శివనాగిరెడ్డి శైలజ మృతదేహాలు

పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని అఘాయిత్యం

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ప్రేమ జంట

పిడుగురాళ్ల, కారంపూడి, మే 26 : తమ పెళ్లికి పెద్దలు అంగీకరించక పోవ టంతో మనస్థాపానికిగురై పురుగుమందు తాగి ఓ ప్రేమజంట బలవన్మరణం పొందిన సంఘటన పిడుగురాళ్ల సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం కారంపూడి మండలం మిర్యాల గ్రామానికి చెందిన బాలిన శివనాగిరెడ్డి (25) పాలటెక్నిక్‌ పూర్తిచేసి నడికుడి సమీపంలోని ఓ కెమికల్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన దుర్గంపూడి శైలజ (17) నరసరావుపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం చదువుతుంది. శివనాగిరెడ్డి, శైలజలు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. గతంలో పలు సందర్భాల్లో తమకు పెళ్లి చేయాలని వారు పెద్దలను సంప్రదించగా చదువు పూర్తయిన తర్వాత మాట్లాడదాం అరి చెబుతూ వచ్చారు. బుధవారం శైలజ తన ఆఖరి పరీక్ష రాసేందుకు నరసరావుపేట వెళ్లింది. అనంతరం శివనాగిరెడ్డితో కలసి ద్విచక్ర వాహనంపై పిడుగురాళ్ల, కారంపూడి మార్గంలో జానపాడు దాటిన తరువాత పందిటివారిపాలెం గ్రామసమీపంలో ఇద్దరూ పురుగుమందు తాగి అపస్మారక స్థితికి వెళ్లారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న వారు వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని అపస్మారకస్థితిలో ఉన్న వారిని  పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ బుధవారం రాత్రి శైలజ మృతి చెందగా, గురువారం శివనాగిరెడ్డి మృతి చెందాడు. జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఇద్దరి మృతదేహాలను గురజాలకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2022-05-27T05:54:56+05:30 IST