కారులో ప్రేమజంట సజీవ దహనం
ABN , First Publish Date - 2022-05-23T18:19:53+05:30 IST
బెంగళూరు నుంచి మూడు రోజుల క్రితం పరారయిన ప్రేమికులు ఉడుపి జిల్లాలో సజీవదహనమయ్యారు. ఉడుపిలోని మందార్తి సమీపంలోని హెగ్గుంజె
- పెళ్లికి నిరాకరించడంతో ఆత్మహత్య ?
బెంగళూరు, మే 22 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి మూడు రోజుల క్రితం కనిపించకుండాపోయిన ప్రేమికులు ఉడుపి జిల్లాలో సజీవ దహనమయ్యారు. ఉడుపిలోని మందార్తి సమీపంలోని హెగ్గుంజె గ్రామ పంచాయతీ వర్తూరు వద్ద కారులోనే ఇద్దరూ కాలిపోయారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఈ ఘటన జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. బెంగళూరులోని ఆర్టీ నగర్కు చెందిన యశ్వంత్ యాదవ్ (22), జ్యోతి (20) సజీవ దహనమైనట్టు గుర్తించారు. కారులో మంటలు చెలరేగగానే స్థానికులు ఆపే ప్రయత్నం చేశారు. అప్పటికే ఇద్దరూ కాలిపోయారు. ఈనెల 19న జ్యోతి అదృశ్యమైనట్టు ఆర్టీ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా, యశ్వంత్ యాదవ్ 20న అదృశ్యమైనట్టు హెబ్బాళ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాల నుంచి వ్యతిరేకత ఉన్నట్టు తెలుస్తోంది. బెంగళూరు నుంచి బైక్పై శనివారం మంగళూరుకు చేరుకున్న వారు అల్మిజ్బా కార్ రెంటల్ సర్వీసెస్ లో కారును అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం సజీవ దహనమయ్యారు. వారు ఇద్దరూ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మావర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.