‘నాడు-నేడు’లో నాణ్యత నిల్
ABN , First Publish Date - 2020-12-03T06:32:18+05:30 IST
‘నాడు-నేడు’ కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని జిల్లాలో నలుగురు ప్రధానో పాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు.
అనకాపల్లి, కశింకోట మండలాల్లో తనిఖీలు
మామిడిపాలెం, కూండ్రం కొప్పాక, తాళ్లపాలెం జడ్పీ పాఠశాలల హెచ్ఎంలు స్పెన్షన్
ముగ్గురు ీఆర్ ఏఈలపై ర్యలకు సిఫారసు
మళ్లీ పనులు... ందుకయ్యే వ్యయం
హెచ్ఎంలు, పీఆర్ ంజనీర్లు, పేరెంట్ మిటీల నుంచి ికవరీ చేయాలని లెక్టర్ ఆదేశం
ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన
విశాఖపట్నం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):
‘నాడు-నేడు’ కింద చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని జిల్లాలో నలుగురు ప్రధానో పాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు పంచాయతీరాజ్ ఏఈలపై చర్యలకు సిఫారసు చేశారు. ఆయా పాఠశాలల్లో మళ్లీ పనులు చేపట్టా లని, అందుకు అయ్యే ఖర్చును ప్రధానో పాధ్యాయులు, పీఆర్ ఇంజనీర్లు, పేరెంట్స్ కమిటీల నుంచి రికవరీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
‘నాడు-నేడు’లో భాగంగా అనకాపల్లి, కశింకోట మండలాల్లో గల పలు పాఠశాలల్లో చేపట్టిన పనుల్లో నాణ్యత లేదని, ముఖ్యంగా గ్రానైట్ ఫ్లోరింగ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయని గత నెలలో జరిగిన డీడీఆర్సీ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గుడివాడ అమర్ ఆరోపించారు. దీంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ మేరకు అనకాపల్లి మండలం మామి డిపాలెం, కూండ్రం, కొప్పాక, కశింకోట మండలం తాళ్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో గ్రానైట్ ఫ్లోరింగ్ను పంచాయతీరాజ్ ఎస్ఈ సుధాకర్రెడ్డి, సమగ్రశిక్షా అభియాన్ ఏసీపీ మల్లికార్జునరెడ్డి పరిశీలించి నాణ్యత లేదని ధ్రువీకరించారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యకు సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో తాళ్లపాలెం, మామిడిపాలెం, కూండ్రం, కొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వి.విజయలక్ష్మి, వి.దాసు, పీవీ సుబ్బారావు, డీఎస్ నాయుడులను సస్పెండ్ చేస్తూ విద్యా శాఖ విశాఖ ఆర్జేడీ నాగేశ్వరరావు ఉత్తర్వులు జారీచేశారు. అనకాపల్లి, కశింకోట పీఆర్ ఏఈలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత ఎస్ఈ సుధాకర్రెడ్డి సిఫారసు చేశారు. అయితే పది రోజుల సెలవుపై వెళ్లిన సుధాకర్రెడ్డి బుధవారం విధుల్లో చేరిన నేపథ్యంలో ఒకటి, రెండు రోజుల్లో ఏఈలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. కాగా నాలుగు పాఠశాలల్లో నాసిరకం గ్రానైట్ ఫ్లోరింగ్ను తొలగించి నాణ్యమైన గ్రానైట్ వేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఆ ఖర్చును నలుగురు హెచ్ఎంలు, ముగ్గురు ఏఈలు, తల్లిదండ్రుల కమిటీ సభ్యులు భరించాలని స్పష్టంచేశారు.
నాణ్యత లోపిస్తే చర్యలు
- మల్లికార్జునరెడ్డి, ఏసీపీ, సమగ్రశిక్షాఅభియాన్
నాడు-నేడు పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేసే పథకంలో ప్రతి పని పక్కాగా ఉండాలి. జిల్లాలో పలు పాఠశాలల్లో పనులు తనిఖీ చేస్తాం. నాణ్యత లేకపోతే చర్యలు తీసుకుంటాం.
హెచ్ఎంలపై చర్యలు అన్యాయం
- యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు
నాడు-నేడు పనుల్లో నాణ్యతాలోపం పేరుతో నలుగురు ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం అన్యాయమని యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తానాడ అప్పారావు, గొంది చిన్నబ్బాయి పేర్కొన్నారు. పనుల పర్యవేక్షణ బాధ్యత అధికారులు, తల్లిదండ్రుల కమిటీలదేనన్నారు. అందుకు హెచ్ఎంలను బాధ్యులను చేయడం దారుణమన్నారు. తక్షణం వీరిపై సస్పెన్షన్ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.