విద్యా కానుక కిట్లు.. పాట్లు
ABN , First Publish Date - 2022-07-06T05:44:16+05:30 IST
పాఠశాలలు తెరుచుకున్నాయి.
అరకొరగా యూనిఫాం, బూట్లు
బ్యాగ్లు నాసిరకం..
విద్యార్థులు, తల్లి దండ్రుల ఆందోళన
భీమవరం ఎడ్యుకేషన్, జూలై 5 : పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థులు ఒక్కొక్కరుగా వస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా జగనన్న విద్యా కానుక కిట్లును పంపిణీని ప్రారంభించింది. ఒక్కో కిట్లో మూడు జతల యూనిఫారాలు, తరగతికి సంబంధించిన పాఠ్య, నోట్ పుస్తకాలు, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, స్కూల్ బ్యాగ్, డిక్షనరీతో కూడిన జీవీకే కిట్లను అందజేయాలి. కానీ, చాలా పాఠశాలలకు ఇవి ఇంకా అందలేదు. కొన్నిచోట్ల యూనిఫామ్ కూడా అందలేదు. గత ఏడాది విద్యా సంవత్సరానికి రెండు నెలలు వ్యవధి ముందే యూనిఫాం ఇచ్చారు. కానీ ఈ ఏడాది అందుబాటులోకి తీసుకు రాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనిఫారం ఇచ్చినా ఎప్పుడు కుట్టించుకునేది.. ఎప్పుడు ఉపయోగించుకునేది ప్రశ్నార్ధకంగా మారింది. 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో 1,368 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 1,077 ప్రాథమిక, 84 ప్రాథమికోన్నత, 207 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో లక్షా 38 వేల 863 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో బాలురు 60,234, బాలికలు 69,629 మంది ఉన్నారు. వీరందరికి యూనిఫాం అందుబాటులో రావడం, అవి కుట్టించాల్సి రావ డం చాలా సమయం పట్టే అవకాశం ఉంది. మరోవైపు విద్యార్థులకందించే పుస్తకాల బ్యాగ్లు నాసిరకంగానే కనిపిస్తున్నాయి. గత ఏడాది తరగతులను బట్టి రెండు రంగులు కలిగిన బ్యాగ్లు అందించారు. ఈ ఏడాది ఒకే రకం బ్యాగ్నే అందరికీ ఇస్తున్నారు. ఇవి కూడా బరువు తక్కువగా, క్లాత్ పలచ ఉండి నాణ్యతా లోపంతో ఉన్నాయి. ఇవి తమ పిల్లల చేతుల్లో ఎన్నాళ్లు మన్నుతాయోనని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల బూట్లు అందుబాటులోకి రాలేదని ఉపాధ్యాయులు చెబు తున్నారు. పాఠశాల సౌకర్యాలతో పాటు విద్యా కిట్లలోని సామగ్రి అంతా అందించకపోవడం విద్యాశాఖ శ్రద్ధ ఎలా ఉన్నదన్నది కనిపిస్తోంది.