ఈ ప్రాంతం.. మీ జాగీరా?
ABN , First Publish Date - 2022-05-24T05:42:57+05:30 IST
రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఈ అరాచకం మరింత ఎక్కువగా ఉందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.
మాచర్ల ప్రాంతంలో వైసీపీ అరాచకం
టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మాచర్ల, మే 23: రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని, మాచర్ల నియోజకవర్గ పరిధిలో ఈ అరాచకం మరింత ఎక్కువగా ఉందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. మండల కేంద్రం దుర్గిలో సోమవారం ఆయన టీడీపీ మాచర్ల నియోజకవర్గ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రామయ్య మాట్లాడుతూ దుర్గి మండలం ఆత్మకూరు, జంగమహేశ్వరపురానికి చెందిన గ్రామస్తులు ఇళ్లు, పొలాలు వదులుకొని ఎక్కడో జీవిస్తుంటే శాంతి భద్రతలు సవ్యంగా ఎక్కడ ఉన్నాయంటూ ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే వారిని గ్రామాలకు తీసుకొచ్చి ఎటువంటి ఆపద లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి వివాహ వేడుకలో పాల్గొనేందుకు వస్తుంటే ఆటంకాలు సృష్టించారని.. ఈ ప్రాంతమేమైనా నీ జాగీరా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళ చనిపోతే ఆమెను గ్రామానికి తీసుకొచ్చి దహనం చేసే పరిస్థితి కూడా లేదన్నారు. ఎమ్మెల్సీ డ్రైవర్ను హత్య చేసి ఆ శవాన్ని ఇంటి వద్ద పడేసి పోతారా.. ఇది ప్రజాస్వామిక పాలనా అంటూ ప్రశ్నించారు. జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ తరఫున నామినేషన్లు వేసేందుకు ముందుకొచ్చిన వారిపై పోలీసులు, ఎస్ఈబీ అధికారులు అక్రమ కేసులు పెట్టి భయపెట్టారని ఆరోపించారు. నియోజకవర్గంలో కేసులన్నీ ఏకపక్షంగా టీడీపీపైనే బనాయించారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వీరి వెంట చిట్టిబాబు, కుర్రి శివారెడ్డి, సాతులూరి కుమార్, సింగు నాగేశ్వరరావు, జానకి రామయ్య, మేకల దాసు తదితరులు ఉన్నారు.