రీసర్వే పకడ్బందీగా చేపట్టాలి : జేసీ
ABN , First Publish Date - 2021-04-18T06:02:05+05:30 IST
జిల్లాలో రీసర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత సంబంధిత అధికారులకు సూచించారు.
విద్యాధరపురం, ఏప్రిల్ 17 : జిల్లాలో రీసర్వే కార్యక్రమం పటిష్టంగా చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత సంబంధిత అధికారులకు సూచించారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష కార్యక్రమంలో భూములు, ఇళ్లు ర్వీసర్వే చేయడం కోసం ప్రామాణిక కార్యనిర్వాహక పద్ధతులపై విజయవాడ డివిజన్కు చెందిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, పంచాయతీ విస్తరణాధికారులు, మండల సర్వేయర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, రీసర్వే మొదటి ఫేజ్లో ఉన్న అన్ని గ్రామాల రెవెన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ సహాయకులు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం రెండవ రోజు జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ గ్రామాలలో భూవివాదాలు లేకుండా భూ సమస్యలు శాశ్వత పరిష్కారానికి వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. జిల్లాలో జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో తొలుత పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ పథకాన్ని గతేడాది డిసెంబరులో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి ప్రారంభించారని అన్నారు. జిల్లాలో ఇళ్ల స్థలాలు కార్యక్రమం విజయవంతం చేసినట్లుగా ఈ పథకాన్ని విజయవంతంగా నిర్వహించాలని రీసర్వే బృందాలకు జాయింట్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు పాల్గొని సిబ్బందికి అనేక సూచనలు చేశారు. రీసర్వే వల్ల ప్రతి రైతు కచ్చితంగా ఉన్న భూ రికార్డులు పొందగలడని తెలిపారు.