తమిళ జాలర్ల విడుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ABN , First Publish Date - 2021-12-29T19:50:03+05:30 IST

శ్రీలంక నావికా దళం ఇటీవల అరెస్టు చేసిన తమిళ జాలర్ల

తమిళ జాలర్ల విడుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన హైకోర్టు

మధురై (తమిళనాడు) : శ్రీలంక నావికా దళం ఇటీవల అరెస్టు చేసిన తమిళ జాలర్ల విడుదలకు తీసుకున్న చర్యలను వివరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం ఆదేశించింది. డిసెంబరు 19 నుంచి 21 వరకు 68 మంది జాలర్లు అరెస్టయ్యారని, వీరిని తిరిగి రప్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఓ నివేదికను సమర్పించాలని బుధవారం కోరింది. 


జాలర్లను విడుదల చేయించాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు తమిళనాడులోని రామేశ్వరంలో నిరవధిక ధర్నా చేస్తున్నారు. జనవరి 1న సామూహిక రైల్ రోకోను నిర్వహించాలని నిర్ణయించారు. తమిళనాడు కడలొర మీనవ సంఘం అధ్యక్షుడు సెసు రాజా, మీనవన్ మీనవ సంఘం అధ్యక్షుడు ఎమెరిట్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీలంక నావికా దళం అరెస్టు చేసిన 68 మంది జాలర్లను, వారి పడవలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయించే వరకు ధర్నా కొనసాగిస్తామని చెప్పారు. 


తమిళనాడులోని రామేశ్వరం, పుదుకొట్టయ్ తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యకారులు వేటకు వెళ్ళగా, వారు అంతర్జాతీయ సముద్ర సరిహద్దులను అతిక్రమించారని ఆరోపిస్తూ వారిని శ్రీలంక నావికా దళం అరెస్టు చేసింది. డిసెంబరు 19 నుంచి 21 వరకు 68 మంది మత్స్యకారులను అరెస్టు చేసింది. దీంతో డిసెంబరు 19 నుంచి మత్స్యకార సంఘాలు ధర్నా నిర్వహిస్తున్నాయి. 


మత్స్యకారులను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాక్ జల సంధిలో భారత దేశానికిగల సంప్రదాయ చేపల వేట హక్కులను పరిరక్షించాలని, జాలర్ల జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2021-12-29T19:50:03+05:30 IST