శివరాత్రి ఉత్సవాల్లో కరోనా నిబంధనలు పాటించాలి
ABN , First Publish Date - 2021-03-07T05:07:14+05:30 IST
మహా శివరాత్రి ఉత్సవాల్లో, స్వామివారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఆదేశించారు.
దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ విజయరాజు
భీమవరం టౌన్, మార్చి 6 : మహా శివరాత్రి ఉత్సవాల్లో, స్వామివారిని దర్శించుకునే భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చూడాలని దేవదాయ, ధర్మదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం.విజయరాజు ఆదేశించారు. పంచారామ క్షేత్రం గునుపూడి సోమేశ్వరస్వామి దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు శనివారం ఆయన పరిశీలించారు. భక్తులందరికీ స్వామి వారిదర్శనం కల్పించేవిధంగా అధికారులు, సిబ్బంది కృషి చెయ్యాలన్నారు. మాస్కులు లేనివారికి స్టాల్ ఏర్పాటుచేసి అందుబాటులో ఉంచాలన్నారు. ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో భక్తులకు వాటర్ ప్యాకెట్లను అందిం చాలని సూచించారు. భక్తుల సౌకర్యం నిమిత్తం పారిశుధ్యం, విద్యుత్, పోలీ స్ అధికారుల సహకారంతో ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిచెయ్యాలని ఈవో అరుణ్కుమార్కు సూచించారు. జిల్లాలోని పలు శివాలయాలను కూడా పరిశీలించి సూచనలు అందించామని తెలిపారు. ఆయనతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి
పాలకొల్లు అర్బన్/పెనుగొండ: మహా శివరాత్రి సందర్భంగా క్షీరా రామం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిం చాలని దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ ఎం. విజయ రాజు (కాకినాడ) అన్నారు. శనివారం ఆలయానికి విచ్చేసిన ఆయన మహాశివరాత్రి ఏర్పట్లపై సమీక్షించారు. ఆయన వెంట జిల్లా కమిషనర్ కేఎన్డీవీ ప్రసాద్, సమీప ఆలయాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఉపకమీషనర్ విజయరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి కుంకుమ పూజలకు నిర్వహించారు. కాగా ఆయన పెనుగొండ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయానికి వెళ్లి శివరాత్రి ఏర్పాట్లపై ఆరా తీశారు.