సర్కారు బడిలో విద్యార్థికి అస్వస్థత
ABN , First Publish Date - 2022-06-25T05:53:04+05:30 IST
సర్కారు బడిలో విద్యార్థికి అస్వస్థత
108లో తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి
మృతికి గల కారణాలపై అస్పష్టత
నర్సింహులపేట (మహబూబాబాద్ ), జూన్ 24 : నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి శుక్రవారం అస్వస్థతకు గురయ్యాడు. ఉ పాధ్యాయులు అప్రమత్తమై 108లో వాహనంలో మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెం దాడు. మృతికి గల కారణాలపై స్పష్టత రాకపోవడంతో విద్యార్థి తల్లిదండ్రులు, తం డావాసులు ఆందోళన చెందుతున్నా రు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. నర్సింహులపేట మండలం ముంగిమడుగు పకీరాతండాకు చెందిన భూక్య అఖిల్ (14) మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి విద్యనభ్యసిస్తున్నాడు. ఈనెల 13న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో ఈనెల 19న మండల కేంద్రంలోని ఎస్సీ వసతి గృహంలో అడ్మిషన్ పొంది హైస్కూ ల్లో చదువుతున్నాడు. రోజువారీగానే శుక్రవారం ఉదయం హాస్టల్ నుంచి పాఠశాలకు వెళ్లాడు. మధ్యాహ్న భోజనం అనంతరం తరగతి గదిలో కూర్చున్న విద్యార్థి అఖిల్ ఒక్కసారిగా కుప్పకూలాడు. తక్షణమే అప్రమత్తమైన ఉపాధ్యాయులు స్థానిక ఆర్ఎంపీచే ప్రాథమిక చికిత్సనందించారు. పరిస్థితి విషమించడంతో 108 ద్వారా జిల్లా ఆస్పత్రికి తరలించారు. అఖిల్ను పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అఖిల్కు సకాలంలో వైద్య పరీక్షలు అందించకపోవడం, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతోనే తమ కుమారుడు మృతి చెందాడని తండ్రి కిషన్, తల్లి మంగమ్మ ఆరోపిస్తూ కన్నీరుమున్నీరుగా రోదించారు. ఉన్నతాధికారులు స్పందించి తమ కుమారుడి మృతిపట్ల క్షేత్రస్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.
విద్యార్థి మృతికి ఎలాంటి సంబంధం లేదు : వెన్నం వెంకట్రెడ్డి,
ఇన్చార్జి హెచ్ఎం, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నర్సింహులపేట
నర్సింహులపేట హైస్కూలో అస్వస్థతకు గురై మృతి చెందిన భూక్య అఖిల్ మృతికి మాకు ఎలాంటి సంబంధం లేదు. తరగతి గదిలో అస్వస్థతకు గురికావడంతో తోటి విద్యార్థులు సమాచారం అందించడంతో తక్షణమే స్పందించాం. 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందడం బాధాకరం. విద్యార్థి మృతికి మాకు ఎలాంటి సంబంధం లేదు.