Eknath Shinde: 9న ‘మహా’ కేబినెట్ విస్తరణ.. 14 మంది ప్రమాణ స్వీకారం
ABN , First Publish Date - 2022-08-08T22:28:36+05:30 IST
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించునున్నారు
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మంగళవారం మంత్రివర్గాన్ని విస్తరించునున్నారు. 14 మంది మంత్రులు రేపు (మంగళవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఒక్కో ప్రాంతం నుంచి ఒక్కొక్కరిని కేబినెట్లోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేతలు సుధీర్ ముంగంటివార్, చంద్రకాంత్ పాటిల్, గిరీష్ మహాజన్ కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, షిండే వర్గం నుంచి గులాబ్ రఘునాథ్ పాటిల్, సదా సర్వాంకర్, దీపక్ వసంత్ కేశార్కర్ కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం.
ఏక్నాథ్ షిండే సారథ్యంలోని శివసేన ఎమ్మెల్యేల తిరుగుబాటుతో మద్దతు కోల్పోయిన ఉద్ధవ్ థాకరే సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) ఉప ముఖ్యమంత్రిగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి మంత్రులు లేకుండా వీరిద్దరే పాలిస్తుండడంతో ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ నేపథ్యంలో కేబినెట్ను విస్తరించాలని ఏక్నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారు.