Maharashtra Political Crisis: అందరికీ థ్యాంక్స్ చెప్పి వెళ్లిపోయిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే..
ABN , First Publish Date - 2022-06-30T01:02:01+05:30 IST
మహారాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని..
ముంబై: మహారాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏదైనా తప్పు జరిగితే క్షమించండని ఉద్ధవ్ ఠాక్రే మంత్రులతో అన్నారు. తన వాళ్లే తనను మోసం చేశారని, కేబినెట్ భేటీ తర్వాత మీడియాకు నమస్కరించి, మంత్రులకు థ్యాంక్స్ చెప్పి ఉద్ధవ్ సచివాలయం నుంచి వెళ్లిపోయారు. ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేస్తారా? కేబినెట్ భేటీలో అందరికీ ధన్యవాదాలు ఎందుకు చెప్పారు? రెండున్నరేళ్లు సహకరించినందుకు థ్యాంక్స్ అని ఎందుకన్నారు? రాష్ట్ర ప్రజలకు థ్యాంక్స్ చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం ఏంటి? ఫినిషింగ్ టచ్గా పట్టణాల పేర్లు మార్చారా? తాను హిందుత్వ వాదినని నిరూపించుకునే ప్రయత్నం చేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలోని కొన్ని పట్టణాల పేరును మారుస్తూ ఉద్ధవ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఔరంగాబాద్ పేరు శంభాజీనగర్గా, ఉస్మానాబాద్ పేరు ధారాశివ్గా, డీబీ పాటిల్ ఎయిర్పోర్ట్గా నవీముంబై ఎయిర్పోర్ట్ను మార్చుతూ చేసిన ప్రతిపాదనలకు ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ ఆమోదం తెలిపింది.
బలపరీక్షపై గవర్నర్ ఆదేశాలను శివసేన చీప్ విప్ సునీల్ ప్రభు సవాలు చేసిన సంగతి తెలిసిందే. సునీల్ ప్రభు పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. సుప్రీం తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే రాజీనామా చేస్తానని ఉద్ధవ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేలంతా గౌహతి నుంచి గోవాకు మకాం మార్చారు. బలపరీక్ష నిరూపించుకోవాల్సిన పరిస్థితే వస్తే ఉద్ధవ్ సర్కార్ కూలిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.