శరద్ పవార్ ఇంటి వద్ద నిరసనలు నిఘా వైఫల్యమే : అజిత్ పవార్

ABN , First Publish Date - 2022-04-09T17:49:09+05:30 IST

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్

శరద్ పవార్ ఇంటి వద్ద నిరసనలు నిఘా వైఫల్యమే : అజిత్ పవార్

ముంబై : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత శరద్ పవార్ ఇంటిపై శుక్రవారం కొందరు నిరసనకారులు రాళ్ళు విసిరిన సంఘటనపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీ నేత అజిత్ పవార్ శనివారం స్పందించారు. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎంఎస్ఆర్‌టీసీ) ఉద్యోగులు శుక్రవారం శరద్ పవార్ ఇంటి వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడంతోపాటు ఆ ఇంటిపై కొందరు రాళ్ళు విసిరిన సంఘటనకు కారణం నిఘా వైఫల్యమేనని అంగీకరించారు. దీనిపై దర్యాప్తునకు ఓ సీనియర్ పోలీస్ అధికారిని నియమించినట్లు తెలిపారు. 


తమకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ ఎంఎస్‌ఆర్టీసీ కార్మికులు 2021 నవంబరు నుంచి సమ్మె చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులతో సమానంగా తమను పరిగణించాలని, ఎంఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 



ముంబైలోని శరద్ పవార్ నివాసం వద్ద శుక్రవారం ఎంఎస్ఆర్‌టీసీ కార్మికులు ధర్నా చేశారు. పెద్ద సంఖ్యలో కార్మికులు ఈ కార్యక్రమంలో పాల్గొని, శరద్ పవార్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతోపాటు కొందరు ఆ ఇంటిపై రాళ్ళు విసిరారు. తమ నష్టాలకు కారణం కారణం శరద్ పవారేనని ఆరోపించారు. తమ సమస్యల పరిష్కారానికి ఆయన చేసిందేమీ లేదన్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ ధర్నాలో పాల్గొన్న దాదాపు 100 మందిని అదుపులోకి తీసుకుని, ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. వీరిలో మహిళలు కూడా ఉన్నారు. 


ఎంఎస్ఆర్‌టీసీ కార్మికుల నిరసనలపై శివసేన నేత సంజయ్ రౌత్ గురువారం స్పందిస్తూ, ఈ నిరసనలు కుట్రపూరితమని ఆరోపించారు. వీటి వెనుక ఎవరు ఉన్నారో త్వరలోనే బయటపడుతుందన్నారు. ఎస్‌టీ కార్మికుల సమ్మెతో శరద్ పవార్‌కు సంబంధం లేదన్నారు. మహారాష్ట్రలో రాజకీయ, సాంఘిక వాతావరణాన్ని కల్లోలపరిచేందుకు ఎవరో ప్రయత్నిస్తున్నారన్నారు. 


మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ శుక్రవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఎంఎస్‌ఆర్‌టీసీ కార్మికులను ఎవరో తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. దీనికి బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించానని చెప్పారు. 


Updated Date - 2022-04-09T17:49:09+05:30 IST