పూర్తి అష్టదిగ్బంధనం ఉండదు : మహారాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-05T23:39:54+05:30 IST

కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ పూర్తి అష్టదిగ్బంధనం

పూర్తి అష్టదిగ్బంధనం ఉండదు : మహారాష్ట్ర ప్రభుత్వం

ముంబై : కోవిడ్-19 కేసులు పెరుగుతున్నప్పటికీ పూర్తి అష్టదిగ్బంధనం విధించబోమని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ టోపే బుధవారం చెప్పారు. అయితే ఆంక్షలను మరింత పెంచేందుకు, వాటిని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు నిర్ణయించామన్నారు. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అధ్యక్షతన జరిగిన కోవిడ్ సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 


కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అష్ట దిగ్బంధనాన్ని విదించడానికి బదులుగా మరిన్ని ఆంక్షలను విధించాలని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సలహా ఇచ్చిందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉన్న సాధారణ కార్యకలాపాలపై ఆంక్షలు పెరుగుతాయన్నారు. ఈ దశలో పూర్తి అష్ట దిగ్బంధనం అవసరం లేదని తెలిపారు. 


రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 25,000కు చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఈ మహమ్మారి సామూహిక వ్యాప్తి జరుగుతుందేమోననే ఆందోళన వ్యక్తం చేశారు. 


ఇదిలావుండగా, తమిళనాడు ప్రభుత్వం ఈ నెల 6 గురువారం నుంచి రాత్రి సమయంలో కర్ఫ్యూను అమలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఆదివారాల్లో పూర్తిగా అష్ట దిగ్బంధనం విధించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఈ వివరాలను ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. కోవిడ్ ఆంక్షలను పెంచాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్ణయించారని  తెలిపారు. 


Updated Date - 2022-01-05T23:39:54+05:30 IST