9 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-03-06T05:55:10+05:30 IST

మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 14వ తేదీ వరకు జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు.

9 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
మహానంది ఆలయ ముఖధ్వారం


  1. ముస్తాబైన మహానంది

మహానంది, మార్చి 5:  మహానంది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈనెల 9వ తేదీ   నుంచి ప్రారంభం కానున్నాయి. 14వ తేదీ వరకు  జరిగే ఉత్సవాలకు ఏర్పాట్లను ఆలయ అధికారులు పూర్తి చేశారు. ఈనెల 7న మహానందీశ్వరుని  కల్యాణోత్సవానికి పెళ్లి పెద్దగా వ్యవహరించేందుకు నంద్యాల పట్టణంలోని బ్రహ్మానందీశ్వరుని ఆహ్వానించేందుకు ఉత్సవ విగ్రహాలు బయలు దేరి వెళతాయి. 8వ తేదీ  బ్రహ్మనందీశ్వరునితోపాటు మహానందీశ్వరుడ్ని  నంద్యాల పట్టణంతో పాటు మండలంలోని  గ్రామాల్లో ఉరేగిస్తారు.    9న ఆలయంలో ధ్వజారోహణం, రాత్రి అశ్వవాహనసేవను నిర్వహిస్తారు. 10న ఉదయం గజవాహనసేవ, రాత్రి రావణ వాహన సేవ జరుపుతారు. 11న  సింహవాహన సేవ, రాత్రి నందివాహన సేవ నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 10 గంటల నుంచి బ్రహ్మోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టమైన  లింగోద్భవ పూజలు, మహారుద్రాభిషేకం నిర్వహిస్తారు. తెల్లవారుజామున 3గంటల నుంచి స్వామి, అమ్మవార్ల కల్యాణం నంద్యాలకు చెందిన దాతలు టి.రామన్న సన్స్‌కు చెందిన లక్కబోయిన ప్రసాద్‌, దిలీ్‌పకుమార్‌ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.  12న  ఉదయం ఆలయంలో మయూర వాహన సేవ, రాత్రి పుష్పపల్లకి సేవ నిర్వహిస్తారు. 13న  రఽథోత్సవం, 14న మహా పుర్ణాహుతి, నాగవళి, మధ్యాహ్నం త్రిశూల స్నానంతో పాటు రాత్రి 7 గంటల నుంచి రుద్రగుండం కొనేరులో తెప్పోత్సవం నిర్వహించడంతో  బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

 బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన మహానంది

 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు  మహానంది ఆలయాన్ని సరికొత్త రంగులతో దేవదాయశాఖ అధికారులు తీర్చిదిద్దారు.   ఆలయ ప్రధాన గోపురాలతో పాటు ప్రహరీలను, శివపార్వతుల విగ్రహాలను రంగులతో అలంకరించారు.   ప్రధాన రాజగోపురానికి  స్టీల్‌ గ్రిల్‌ ఏర్పాటు చేశారు. అలాగే మిగతా గోపురాలకు విద్యుత్‌ బల్బులు ఏర్పాటు చేశారు. దీంతో ఆలయ పరిసరాలు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. 


Updated Date - 2021-03-06T05:55:10+05:30 IST