Mahatma Gandhi: మహాత్మాగాంధీకి అవమానం.. హిందూ మహాసభ మండపంలో మహిషాసురుడిగా గాంధీ

ABN , First Publish Date - 2022-10-04T00:41:22+05:30 IST

మహాత్మాగాంధీ(Mahatma Gandhi)కి కోల్‌కతాలో తీరని అవమానం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో

Mahatma Gandhi: మహాత్మాగాంధీకి అవమానం.. హిందూ మహాసభ మండపంలో మహిషాసురుడిగా గాంధీ

కోల్‌కతా: మహాత్మాగాంధీ(Mahatma Gandhi)కి కోల్‌కతాలో తీరని అవమానం జరిగింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో గాంధీ(Mahatma Gandhi)ని మహిషాసురిడిగా మార్చేశారు. ఈ పూజా మండపంలో అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహంలో మహిషాసురుడి స్థానంలో మహాత్మాగాంధీని పెట్టడం వివాదానికి కారణమైంది. దుర్గామాత చేతిలోని శూలం మహిషాసురుడి రూపంలో ఉన్న గాంధీ(Mahatma Gandhi)ని వధిస్తున్నట్టుగా ఉంది. మహాత్మాగాంధీకి జరిగిన అవమానంపై నిరసనలు పెల్లుబకడంతో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై కేసు కూడా నమోదు కావడంతో పోలీసులు సూచనల మేరకు గాంధీ(Mahatma Gandhi) విగ్రహాన్ని తొలగించారు.


ఈ ఘటనపై వెల్లువెత్తుతున్న నిరసనలపై ఆల్ ఇండియా హిందూ మహాసభ బెంగాల్ రాష్ట్ర విభాగం కార్యనిర్వాహక అధ్యక్షుడు చంద్రచూర్ గోస్వామి స్పందిస్తూ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని తాము నిజమైన అసురుడి (రాక్షసుడు)గా చూస్తున్నామని, అయన నిజమైన అసురుడని పేర్కొన్నారు. అందుకనే దేవీ విగ్రహంలో గాంధీ(Mahatma Gandhi)ని పెట్టినట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ(Mahatma Gandhi)ని ప్రమోట్ చేస్తోందని, కానీ తాము  మాత్రం ఆయన బొమ్మలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తమపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఒత్తిడి ఉందన్నారు. గాంధీ(Mahatma Gandhi)ని అన్ని చోట్ల నుంచి తొలగించి ఆ స్థానంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఇతర స్వాతంత్ర్య సమరయోధులను ఉంచాలని అనుకుంటున్నట్టు చెప్పారు. దుర్గాదేవి విగ్రహంలో అసురుడిగా గాంధీ(Mahatma Gandhi)ని చిత్రీకరించిన విషయం వెలుగులోకి రావడంతో అన్ని పార్టీల నేతలు స్పందించారు. దీనిని తీవ్రంగా ఖండించారు. పురాణాల ప్రకారం దుష్టపాలనను అంతం చేయడానికి దుర్గాదేవి మహిషాసురుడిని వధిస్తుంది. 


కాగా, దుర్గాదేవి మండపంలో మహిషాసురుడిగా ఉన్న గాంధీ(Mahatma Gandhi)ని చూసిన ఓ జర్నలిస్ట్ దానిని ఫొటో తీసి ట్వీట్టర్‌లో షేర్ చేశారు. అయితే, ఇది ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, ఆ ట్వీట్‌ను తొలగించాలని కోరడంతో ఆయన దానిని ఆ తర్వాత తొలగించారు. కాగా, గాంధీని ఇలా అవమానించడాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీలు ఖండించాయి. బెంగాల్ ప్రావిన్షియల్ హిందూ మహాసభ కూడా దీనిని తీవ్రంగా ఖండించింది. గాంధీని ఇలా అవమానించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొంది. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన వారు తాము హిందూ మహాసభ అని చెప్పుకుంటున్నారని, కానీ ఇది చాలా విచారకరమని అన్నారు. 

 

జాతిపిత(Mahatma Gandhi)కు ఇంతకుమించిన అవమానం మరోటి లేదని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికి ఇది అవమానమేనని అన్నారు. ఈ దారుణంపై బీజేపీ ఏమని చెబుతుందని ప్రశ్నించారు. గాంధీని హత్య చేసింది ఎవరో అందరికీ తెలుసని అన్నారు. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్.. తాము దీనిని ఇప్పటికే ఖండించినట్టు చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-10-04T00:41:22+05:30 IST