Statue Vandalised : న్యూయార్క్లో మహాత్మా గాంధీ విగ్రహం ధ్వంసం
ABN , First Publish Date - 2022-08-19T22:02:00+05:30 IST
జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పట్ల కొందరు
న్యూయార్క్ : జాతిపిత మహాత్మా గాంధీ (Mahatma Gandhi) పట్ల కొందరు దుండగులు దారుణంగా ప్రవర్తించారు. న్యూయార్క్ (New York) సిటీలోని శ్రీ తులసి మందిర్ (Sri Tulsi Mandir) వద్ద ఉన్న గాంధీజీ విగ్రహాన్ని ఈ నెల 16న ధ్వంసం చేశారు. రోడ్డుపైనా, ఆ విగ్రహం చుట్టూ విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. దుండగులు కార్లలో పారిపోయారు. ఈ విగ్రహంపై దాడి జరగడం ఈ నెలలో ఇది రెండోసారి.
అమెరికాలో గాంధీ విగ్రహాలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. శ్రీ తులసి మందిర్ వద్ద ఉన్న గాంధీజీ విగ్రహంపై ఈ నెల 3న మొదటిసారి దాడి జరిగింది. ఈ దాడిలో కొంత భాగం దెబ్బతింది. ఈ నెల16న మళ్ళీ ఆరుగురు దుండగులు కార్లలో వచ్చి, విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసానికి సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. 25 నుంచి 30 సంవత్సరాల వయసుగల ఆరుగురు వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్లు గుర్తించారు.
న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ మెంబర్ జెనిఫర్ రాజ్కుమార్ ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని, చట్ట ప్రకారం విధించదగిన కఠిన శిక్షను విధించాలని డిమాండ్ చేశారు. ఈ విద్వేషపూరిత శక్తులను ఓడించగలమనే నమ్మకం తనకు ఉందన్నారు.
జూలై 14న కెనడాలో కూడా మహాత్మా గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. న్యూయార్క్ సిటీలోని మన్హటన్లో ఫిబ్రవరిలో ఓ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.