రీసర్వే పకడ్బందీగా చేయండి: కలెక్టర్
ABN , First Publish Date - 2021-06-24T04:57:22+05:30 IST
వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీ సర్వేని పకడ్బందీగా, వేగవంతంగా చేపట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను కలెక్టర్ వీర పాండియన్ ఆదేశించారు.
కర్నూలు(కలెక్టరేట్), జూన్ 23: వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం రీ సర్వేని పకడ్బందీగా, వేగవంతంగా చేపట్టాలని ఆర్డీవోలు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లను కలెక్టర్ వీర పాండియన్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి వివిధ అంశాలపై బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, డీఆర్వో పుల్లయ్య, సర్వేశాఖ ఏడీ హరిక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. భూ రికార్డులన్నింటినీ డిజిటల్ సర్వే చేయించి, హద్దురాళ్లు ఏర్పాటు చేయాలని, దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని భూసమస్య లను పరిష్కరించాలని సూచించారు. ప్రొఫార్మ-3, 5 పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సీసీఆర్సీ కార్డులపై కౌలు రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని, అర్హులందరికీ సీసీఆర్సీ కార్డులు మంజూరు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. రెగ్యులర్ వర్క్తో పాటు మీసేవ, మ్యుటేషన్లో పెండింగ్ లేకుండా చూడాలని సూచించారు. కార్యాలయానికి వచ్చిన వెంటనే తహసీల్దార్లు స్పందన వెబ్సైట్ను ఓపెన్ చేయాలని, తమ స్థాయిలో ఉన్న అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. గడువు ముగియకముందే అర్జీలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటి స్థలాల దరఖాస్తులను పరిశీలించి, లబ్ధిదారులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని ఆదేశించారు. రోడ్లు, రైల్వే, పరిశ్రమలు, సోలార్ ప్లాంట్లకు కావాల్సిన స్థలాలను వెంటనే సేకరించాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో అంగన్వాడీ భవన నిర్మాణాలకి 176 స్థలాలను ఇంకా ఎందుకు గుర్తించలేదని ప్రశ్నించారు. వెంటనే స్థలాలను సేకరించాలని ఆదేశించారు. ఫైబర్ నెట్ అందుబాటులో ఉన్న గ్రామా లలో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు కోసం ఐదు సెంట్ల స్థలాన్ని కేటాయించాలని తహసీల్దార్లకు సూచించారు. గ్రామ సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తదితర ప్రభుత్వ భవనాలకు స్థల సేకరణ పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు.