కేంద్రంపై మమత ఆరోపణలు... అంతా సజావుగానే ఉందన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ...

ABN , First Publish Date - 2021-12-27T22:37:21+05:30 IST

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల

కేంద్రంపై మమత ఆరోపణలు... అంతా సజావుగానే ఉందన్న మిషనరీస్ ఆఫ్ చారిటీ...

కోల్‌కతా : మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల బ్యాంకు ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభింపజేసిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ ఓ ట్వీట్‌లో ఆరోపించారు. కేంద్రం చర్య వల్ల ఆ సంస్థలోని 22 వేల మంది రోగులు, ఉద్యోగులు ఆహారం, మందులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. అయితే మమత ఈ ట్వీట్ చేసిన కాసేపటికి ఆ సంస్థ స్పందిస్తూ, అంతా సజావుగానే ఉందని వెల్లడించింది. 


మమత బెనర్జీ సోమవారం ఇచ్చిన ట్వీట్‌లో, భారత దేశంలో మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థల అన్ని బ్యాంకు ఖాతాలను క్రిస్ట్‌మస్‌నాడు కేంద్ర మంత్రిత్వ శాఖ స్తంభింపజేసినట్లు విని దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఆ సంస్థల ఉద్యోగులు, చికిత్స పొందుతున్న 22 వేల మంది రోగులు ఆహారం, మందులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. చట్టం అన్నిటి కన్నా గొప్పది అయినప్పటికీ, మానవతావాద కృషికి విఘాతం కలిగించరాదని తెలిపారు. 


ఈ నేపథ్యంలో మిషనరీస్ ఆఫ్ చారిటీ అధికార ప్రతినిధి సునీత కుమార్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, దీని గురించి తమకు ఎవరూ ఏమీ చెప్పలేదన్నారు. దీని గురించి తనకు అసలు ఏమీ తెలియదన్నారు. భారత ప్రభుత్వం తమకు ఏమీ చెప్పలేదన్నారు. బ్యాంకు లావాదేవీలు సజావుగానే జరుగుతున్నాయని చెప్పారు. అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు. 


Updated Date - 2021-12-27T22:37:21+05:30 IST