Partha Chatterjee in jail: కీలక ప్రకటన చేసిన మమతా బెనర్జీ

ABN , First Publish Date - 2022-08-01T23:39:13+05:30 IST

స్కూల్ జాబ్స్ కుంభకోణంలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీ(Partha Chatterjee) అరెస్ట్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి

Partha Chatterjee in jail: కీలక ప్రకటన చేసిన మమతా బెనర్జీ

కోల్‌కతా: స్కూల్ జాబ్స్ కుంభకోణంలో మాజీ మంత్రి పార్థ ఛటర్జీ(Partha Chatterjee) అరెస్ట్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (mamata banerjee) కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ ఛటర్జీ జైలులో ఉండడం, మరో ఇద్దరు మంత్రులు చనిపోవడంతో కేబినెట్‌ను పునర్‌వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. బుధవారమే కేబినెట్ విస్తరణ ఉంటుందని సోమవారం మమత ప్రకటించారు. కొత్త కేబినెట్‌లో నలుగురైదుగురు కొత్త ముఖాలకు చోటు దక్కుతుందని భావిస్తున్నారు. బుధవారం కేబినెట్‌ను విస్తరించనుండగా, అదే రోజు సాయంత్రమే కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 


కేబినెట్ సమావేశం అనంతరం మమత మాట్లాడుతూ.. సుబ్రతా ముఖర్జీ, సాధన్ పాండే చనిపోయారని, పార్థ ఛటర్జీ జైలులో ఉన్నారని తెలిపారు. పంచాయతీ, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు వంటి ముఖ్యమైన శాఖలు వారి వద్ద ఉన్నాయని అన్నారు. కాబట్టి తాను మరింత ఒత్తిడి తీసుకోలేనని, కాబట్టి కేబినెట్‌లోకి కొత్త ముఖాలను తీసుకుంటానని వివరించారు. అలాగే, కొందరు నేతలకు పార్టీని బలోపేతం చేసే బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. బుధవారం చిన్నపాటి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని మమత పేర్కొన్నారు. 


విశ్వనీయ వర్గాల ప్రకారం.. కేబినెట్‌లో కొందరు యువకులకు చోటు దక్కే అవకాశం ఉంది. అలాగే, రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు మమత ప్రకటించారు. ముర్షీదాబాద్, నదియా, నార్త్ 24 పరగణాలు జిల్లాలను విభజించి కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తారు. కొత్త జిల్లాలుగా బెర్హంపోర్(Berhampore), కాండి (Kandi), ఇచ్చమోటి (Ichhamoti), బాసిర్హుట్ (Basirhut), రాణాఘాట్(Ranaghat), సుందర్బన్(Sundarban)తోపాటు బంకురా(Bankura) విభజించి  బిష్ణుపూర్‌(Bishnupur)ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 23 జిల్లాలు ఉన్నాయి. కొత్త వాటితో కలుపుకుని వాటి సంఖ్య 30కి పెరగనుంది.

Updated Date - 2022-08-01T23:39:13+05:30 IST