తల నరికి.. ఏకంగా సీఎం ఫాంహౌస్ సమీపంలో పూడ్చిపెట్టారు!

ABN , First Publish Date - 2021-06-22T14:10:22+05:30 IST

ముగ్గురు వ్యక్తులు కలిసి మరో మిత్రుడిని అత్యంత దారుణంగా హతమార్చారు. తల నరికి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాంహౌస్ సమీపంలోనే శవాన్ని పూడ్చిపెట్టారు.

తల నరికి.. ఏకంగా సీఎం ఫాంహౌస్ సమీపంలో పూడ్చిపెట్టారు!

చండీగఢ్: ముగ్గురు వ్యక్తులు కలిసి మరో మిత్రుడిని అత్యంత దారుణంగా హతమార్చారు. తల నరికి, ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఫాంహౌస్ సమీపంలోనే శవాన్ని పూడ్చిపెట్టారు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. సత్నాం సింగ్, దేశ్ రాజ్, జాగీర్ సింగ్ అనే ముగ్గురు మిత్రులు.. సుచా సింగ్ అనే మిత్రుడిని మద్యం తాగుదాం అంటూ పిలిచారు. సీఎం ఫాంహౌస్ సమీపంలోనే వీళ్లంతా మద్యం తాగడం ప్రారంభించారు. వీరిలో ఒకరికి సుచా సింగ్ రూ.60వేలు బాకీ ఉన్నాడు. అవి ఎప్పుడిస్తావు? అంటూ ముగ్గురూ కలిసి సుచాను నిలదీశారు. ప్రస్తుతం కరోనా కష్టాల్లో ఉన్న సుచా.. ఇంకా సమయం కావాలని అడిగాడు. ఈ క్రమంలో వీరి మధ్య వివాదం చెలరేగింది.


వివాదం పెరగడంతో ముగ్గురు మిత్రులూ కలిసి సుచాపై దాడి చేశారు. కత్తితో అతని తల నరికి, దగ్గరలోనే ఆ శవాన్ని పూడ్చిపెట్టి వెళ్లిపోయారు. ఈ ఘటన ఈ నెల 12న జరిగింది. సుచా ఇంటికి తిరిగిరాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో సుచా మృతదేహాన్ని పూడ్చిపెట్టిన ప్రదేశంలో అతని కాళ్లు కనిపించడంతో భయపడిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వెళ్లిన పోలీసులకు తల లేని మృతదేహం కనిపించింది. దుస్తులను చూసి అది సుచా మృతదేహమని గుర్తించారు. దర్యాప్తులో ఆ రోజు సుచాను కలిసిన ముగ్గురిని పట్టుకునే ప్రయత్నం చేశారు. సత్నాం సింగ్, దేశ్ రాజ్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. జాగీర్ సింగ్ పరారీలో ఉన్నాడు.

Updated Date - 2021-06-22T14:10:22+05:30 IST