గొరిగెనూరులో వ్యక్తి దారుణ హత్య
ABN , First Publish Date - 2021-10-26T04:52:24+05:30 IST
మండలంలోని గొరిగెనూరు పెన్నానది శివారు ప్రాంతంలోని మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం సర్వం నరసింహులు అలియాస్ వరాలు (35) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
జమ్మలమడుగు రూరల్, అక్టోబరు 25: మండలంలోని గొరిగెనూరు పెన్నానది శివారు ప్రాంతంలోని మామిడి తోటలో సోమవారం మధ్యాహ్నం సర్వం నరసింహులు అలియాస్ వరాలు (35) అనే వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు... పెద్దముడియం మండలం గుండ్లకుంట గ్రామానికి చెందిన సర్వం నరసింహులు జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు రాజీవ్నగర్ కాలనీలో నివాసం ఉంటూ బేల్దారి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మృతుడు గొరిగెనూరు గ్రామానికి ఆదివారం జ్యోతుల మహోత్సవానికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. స్నేహితుడితో కలిసి మామిడి తోటలో పార్టీ చేసుకోవడానికి వెళ్లినట్లు మృతుడి బంధువులు తెలిపారు. ఘటనా స్థలంలో మద్యం సీసాతో గొంతులో పొడిచి హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న జమ్మలమడుగు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు, వారి సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతుడికి ఒక కూతురు ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని సీఐ తెలిపారు.