బెంగళూరు వర్షాలతో పాడైన కారు.. రిపేర్కు ఇచ్చిన వ్యక్తికి దిమ్మతిరిగే షాక్..
ABN , First Publish Date - 2022-10-02T03:04:45+05:30 IST
చెడిపోయిన తనకారును రిపేర్కు ఇచ్చిన ఓ వ్యక్తికి ఇటీవల భారీ షాక్ తగిలింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల బెంగళూరులో కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ధనికులు కూడా తట్టాబుట్టా సర్దుకుని ట్రాక్టర్లలో ఇళ్లను వీడి తరలిపోవాల్సిన దుస్థితిని తెచ్చాయి. నీళ్లలో కార్లు మునిగిపోవడంతో.. రిపేర్ల ఖర్చు తడిసిమోపెడవుతున్నాయి. అయితే.. చెడిపోయిన తనకారును రిపేర్కు ఇచ్చిన ఓ వ్యక్తికి ఇటీవల భారీ షాక్ తగిలింది. కారు ఖరీదు రూ.11 లక్షలు అయితే.. రిపేర్ చేయించేందుకు రూ.22 లక్షల ఖర్చు అవొచ్చని(Bill Estimate) షో రూం వారు చెప్పారంటూ అనిరుధ్ అనే వ్యక్తి లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టాడు. ఇది ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
తన కారు చెడిపోవడంతో వైట్ఫీల్డ్లోని(Whitefield) ఫోక్స్వ్యాగన్ యాపిల్ ఆటో షోరూంలో రిపేర్కు పంపించినట్టు చెప్పాడు. కారును రిపేర్ చేయాలంటే రూ.22 లక్షలు అవ్వొచ్చంటూ వారు ఎస్టిమేట్ బిల్లు(అంచనా వ్యయం) ఇవ్వడంతో తాను షాకైపోయినట్టు తెలిపాడు. దీంతో.. తాను ఇన్సూరెన్స్ కంపెనీని సంప్రదించగా..కారును పూర్తిగా డ్యామెజ్ అయిపోయినట్టు గుర్తిస్తామని వారు చెప్పారని పేర్కొన్నాడు. తామే కారును తీసుకెళ్లేందుకు అంగీకరించారని పేర్కొన్నాడు. ఈ క్రమంలో.. అతడు కారును వెనక్కు తెచ్చుకునేందుకు మరోసారి షోరూంకు వెళ్లగా.. ఈమారు రూ.44 వేలు చెల్లించి కారు తీసుకెళ్లానని షో రూం వారు చెప్పడంతో తాను నిర్ఘాంతపోయినట్టు తెలిపాడు. ఇన్నాళ్ల పాటు కారును షోం రూంలోనే ఉంచినందుకు, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు సిద్ధం చేసినందుకు ఈ ఖర్చు అయిందని వారు చెప్పుకొచ్చారట. దీంతో.. తాను కస్టమర్ కేర్కు ఫిర్యాదు చేశానని ఆయన తెలిపాడు. మొదట్లో వారు బిల్లు తగ్గించేందుకు అంగీకరించకపోయినా ఉత్తరప్రత్యుత్తరాల తరువాత.. రూ. 5 వేల కట్టి కారు తీసుకెళ్లమన్నట్టు చెప్పుకొచ్చాడు. ఇలాంటి సందర్భాల్లో కస్టమర్లకు రూ.5 వేలకు మించి బిల్లు వేయకుండా నిబంధనల్లో మార్పు కూడా చేస్తామని కంపెనీ హామీ ఇచ్చినట్టు వివరించారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.