దారుణం.. కొడుకు పుడతాడన్న ఆశతో కుమార్తెను బలిచ్చిన తండ్రి!

ABN , First Publish Date - 2020-11-15T02:09:31+05:30 IST

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 8 దశాబ్దాలు అయింది. అయినప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాలు ఇంకా గతంలోనే చిక్కుకుపోయాయి.

దారుణం.. కొడుకు పుడతాడన్న ఆశతో కుమార్తెను బలిచ్చిన తండ్రి!

రాంచీ: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 8 దశాబ్దాలు అయింది. అయినప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాలు ఇంకా గతంలోనే చిక్కుకుపోయాయి. ప్రపంచం మొత్తం అభివృద్ధివైపు పరుగులు తీస్తున్నా.. కొందరు మాత్రం తమను తాము చీకట్లోనే బంధించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని చాలా ప్రాంతాలు ఇంకా మంత్రతంత్రాల వెంటే పరుగులు తీస్తున్నాయి. అందులో చిక్కుకుని బయటపడలేక విలవిల్లాడుతున్నాయి. తాజా ఘటన ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది. కొడుకు పుట్టాలంటే కుమార్తెను బలివ్వాలన్న ఓ మంత్రగాడి మాయమాటలు నమ్మిన ఓ తండ్రి కన్న కూతురును పొట్టనపెట్టుకున్నాడు. 


పోలీసుల కథనం ప్రకారం.. రాజధాని రాంచీలోని లోహర్డగ పెష్రార్ బ్లాక్‌కు చెందిన 26 ఏళ్ల సుమన్ నగాసియా రోజు కూలీ. అతడికి ఆరేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల అతడు ఓ భూతవైద్యుడిని కలిసి తనకు మగపిల్లాడు లేడని చెబుతూ బాధపడ్డాడు. అతడి వేదన విన్న భూతవైద్యుడు.. అబ్బాయి కావాలంటే ఉన్న అమ్మాయిని బలివ్వాలని చెప్పాడు. అది నిజమేనని నమ్మిన సుమన్ మరో ఆలోచన లేకుండా కుమార్తె తల నరికి బలిచ్చాడు. ఈ ఘటన జరిగినప్పుడు బాలిక తల్లి ఆమె తల్లిగారింటి వద్ద ఉంది. 


ఈ దారుణంపై సమాచారం అందుకున్న పోలీసులు సుమన్‌ను అరెస్ట్ చేసి, బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. విషయం తెలుసుకున్న భూతవైద్యుడు పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. 


Updated Date - 2020-11-15T02:09:31+05:30 IST