భార్యపై అనుమానంతో తరచుగా ఇళ్లు మార్చేవాడు.. అయినా అనుమానం తీరక ఎంత దారుణానికి తెగించాడంటే..

ABN , First Publish Date - 2022-02-23T21:58:51+05:30 IST

అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అనుమానం వచ్చిందంటే అది ఎప్పటికీ తీరదు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ భర్త..

భార్యపై అనుమానంతో తరచుగా ఇళ్లు మార్చేవాడు.. అయినా అనుమానం తీరక ఎంత దారుణానికి తెగించాడంటే..

అనుమానం పెనుభూతం అంటారు. ఒక్కసారి అనుమానం వచ్చిందంటే అది ఎప్పటికీ తీరదు. తాజాగా కర్ణాటకకు చెందిన ఓ భర్త.. భార్యపై అనుమానం పెంచుకుని జీవితాన్ని దుర్భరం చేసుకున్నాడు. తను ప్రశాంతంగా ఉండకుండా, ఆమెను ఉండనివ్వకుండా చేసి చివరకు ఆమెను, ఆమె తల్లిని చంపేశాడు. తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. బెంగళూరు‌లోని గోవిందరాజనగర పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం జరిగింది. 


కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహళ్లికి చెందిన రవికుమార్‌ తన భార్య సావిత్రి, పిల్లలతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నాడు. సావిత్రి తల్లి సరోజ కూడా వారి వద్దే ఉంటోంది. కాగా, సావిత్రిపై రవికుమార్‌కు ఎప్పట్నుంచో అనుమానం ఉండేది. ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానిస్తుండేవాడు. అందుకే తరచుగా ఇల్లు మారుతుండేవాడు. అయినా అతని అనుమానం తీరలేదు. భార్యతో తరచుగా గొడవ పడుతుండేవాడు. 


మంగళవారం ఉదయం పిల్లలను స్కూల్‌ వద్ద వదిలి ఇంటికెళ్లి భార్యతో మళ్లీ గొడవ పడ్డాడు. ఆ గొడవలో ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కొబ్బరికాయలు కొట్టే కత్తిని తీసుకుని భార్య సావిత్రి, ఆమె తల్లి సరోజను నరికేశాడు. రక్తం అంటిన బట్టలతోనే స్కూటర్‌పై గోవిందరాజనగర పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. తండ్రి అనుమానం కారణంగా పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. 

Updated Date - 2022-02-23T21:58:51+05:30 IST