ఇల్లు ఒకటి, దేశాలు రెండు.. తినేది ఇక్కడ.. పడుకునేది అక్కడ..
ABN , First Publish Date - 2021-02-28T20:53:51+05:30 IST
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్కు ఉత్తర భాగంలో మన్ జిల్లాలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంపేరు లోంగ్వా. ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ గ్రామం ఒకేసారి రెండు రాష్ట్రాల్లో ఉంటుంది. లోంగ్వా గ్రామం..
ఇంటర్నెట్ డెస్క్: ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్కు ఉత్తర భాగంలో మన్ జిల్లాలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంపేరు లోంగ్వా. ఆ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఆ గ్రామం రెండు దేశాల్లో ఉంటుంది. లోంగ్వా గ్రామం ఇండియా, మయన్మార్ దేశాల సరిహద్దుల్లో ఉంది. ఈ గ్రామం మధ్యలో నుంచి ఇరు దేశాల సరిహద్దు రేఖ వెళుతుంది. ఇక్కడి కొణ్యక్ గిరిజనులకు రెండు దేశాలూ తమ దేశ పౌరసత్వం కల్పించాయి. అంతేకాదు ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. ఈ గ్రామ పెద్ద లోక్నంగ్ ఇళ్లు సరిగ్గా ఇరు దేశాల సరిహద్దు రేఖపై ఉంది. ఈ ఇల్లు సగం ఇండియాలోనూ, మరో సగం మయన్మార్లోనూ ఉంది. అంటే ఆయన రోజూ భారత్లో భోజనం చేసి మయన్మార్లో నిద్రపోతాడన్నమాట.
ఈ ఊళ్లోని యువకుల్లో కొంతమంది భారత్లో వ్యాపారం చేస్తుంటే మరికొందరు మయన్మార్ సైన్యంలో పనిచేస్తున్నారు. తమ దృష్టిలో భారత్కూ, మయన్మార్కీ తేడాలేదని వారు చెబుతుంటారు. వీరిని భారత్లోని అతి పురాతనమైన ‘హెడ్ హంటర్స్’ ఆదివాసీలుగా పేర్కొంటారు. కొన్నేళ్ల కిందటి వరకూ శత్రువులుగా భావించే ఇతర గిరిజన తెగ ప్రజల తలలు నరికి తేవడం వీరి సంప్రదాయంలో భాగంగా ఉండేదట. అయితే 1960 తర్వాత క్రిస్టియానిటీ ప్రబలిన తరువాత వీరు క్రమేపీ అంతరించిపోయారు. అలా ఎవరు చేసినా ఏదో ఘనకార్యం అన్నట్లు గుర్తుగా ఆ వ్యక్తి ఒంటిమీద పచ్చబొట్టు వేయించి, సంబరాలు జరుపుకునేవారట. ఈతరం అలా లేదు కానీ అక్కడి వృద్ధుల ఒంటిమీద కనిపించే పచ్చబొట్లు వాళ్లు ‘హెడ్ హంటర్స్’ అని ఇప్పటికీ గుర్తు చేస్తుంటాయి. భారత్, మయన్మార్ దేశాల్లోని గ్రామాల్లో కలిపి దాదాపు 20లక్షల మంది కొణ్యక్ గిరిజనులు ఉంటారు.