పెళ్లికూతురుకు ప్రియురాలు బోనస్.. ఇద్దరినీ ఒకే మండపంలో..

ABN , First Publish Date - 2020-07-12T02:22:14+05:30 IST

కల్యాణ మండపంలో మేళాలు మోగుతున్నాయి.. పంతులు మంత్రాలు చదువుతున్నాడు......

పెళ్లికూతురుకు ప్రియురాలు బోనస్.. ఇద్దరినీ ఒకే మండపంలో..

భోపాల్: కల్యాణ మండపంలో మేళాలు మోగుతున్నాయి.. పంతులు మంత్రాలు చదువుతున్నాడు... ఇంతలో పెళ్లికొడుకు లేచి పెళ్లికూతుళ్లకు తాళి కట్టాడు. మీరు చదివింది కరెక్టే.. వధువు ఒక్కరు కాదు.. ఇద్దరు. వింతగా ఉందా.. కానీ ఇది నిజం. తల్లిదండ్రుల అభీష్టం ప్రకారం పెళ్లికూతురుకూ, తన ఇష్టం ప్రకారం ప్రియురాలికీ ఏకకాలంలో అదే మండపంలో తాళి కట్టాడో వరుడు. ఈ తంతంతా సపరివార సమేతంగా విచ్చేసిన బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాల సాక్షిగా జరిగింది. పంచాయతీ పెద్దల తలతిక్క నిర్ణయం వల్ల జరిగిన ఈ వేడుకకు పెళ్లికొడుకు తల్లిదండ్రులతో పాటు, ఇద్దరు పెళ్లికూతుళ్ల కుటుంబాలు విచ్చేసి వధూ, వరులను ఆశీర్వదించాయి. ఈ వింత పెళ్లి మధ్యప్రదేశ్‌లోని బేతుల్ ప్రాంతంలో జరిగింది. సందీప్ ఉయికే అనే స్థానికుడు ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. ఉయికే భోపాల్‌లో చదువుకుంటున్న సమయంలో హోషంగాబాద్‌కు చెందిన ఓ యువతితో పరిచయమైంది.


ఆ పరిచయం కాస్తా ప్రణయంగా మారింది. అయితే ఈ విషయం తెలియని ఉయికే కుటుంబసభ్యులు అతడికి మరో యువతితో వివాహం నిశ్చయించారు. ఈ నేపథ్యంలో ఉయికే ప్రేమకలాపం బయటపడింది. దీంతో మూడు కుటుంబాలు పంచాయతీ పెద్దలను ఆశ్రయించాయి. అయితే అక్కడి పెద్దలు ఓ పనికిమాలిన తీర్పునిచ్చారు. యువతులిద్దరి కుటుంబాలకు ఇష్టమైతే ఇద్దరినీ ఉయికే వివాహం చేసుకోవచ్చని ప్రకటించారు.


యువతుల కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో అంగరంగ వైభవంగా ఉయికే వివాహం జరిగింది. ఇదిలా ఉంటే ఈ వివాహానికి సంబంధించి అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై విచారణ జరిపేందుకు అధికారులను పంపుతున్నట్లు కూడా తెలుస్తోంది. కరోనా కాలంలో ఎటువంటి అనుమతి లేకుండా వేడుక జరపడంపై కూడా దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం.

Updated Date - 2020-07-12T02:22:14+05:30 IST