చనిపోయాడనుకుంటే.. నెల తరువాత తిరిగొచ్చాడు !

ABN , First Publish Date - 2022-04-06T15:32:57+05:30 IST

ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాళయం సమీపంలో చనిపోయాడంటూ అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు, బంధువులు నిర్ఘాంతపోయారు.

చనిపోయాడనుకుంటే.. నెల తరువాత తిరిగొచ్చాడు !

పెరంబూర్‌(చెన్నై): ఈరోడ్‌ జిల్లా గోపిశెట్టిపాళయం సమీపంలో చనిపోయాడంటూ అంత్యక్రియలు నిర్వహించిన వ్యక్తి తిరిగి ప్రత్యక్షం కావడంతో కుటుంబసభ్యులు, బంధువులు నిర్ఘాంతపోయారు. తురయంపాళయం గ్రామానికి చెందిన మూర్తి (55) పొరుగు గ్రామాలకు వెళ్లి చెరకు నరికే పనులు చేస్తుంటాడు. కొద్దిరోజుల క్రితం పనికి వెళ్తున్నానని కుటుంబసభ్యులకు చెప్పిన మూర్తి తిరిగి ఇంటికి రాలేదు. అతని కోసం కుమారుడు కార్తీ చుట్టుపక్కల గ్రామాల్లో విచారించినా ఫలితం లేకపోయింది. ఈ నేపధ్యంలో, గత నెల 31వ తేది సత్యమంగళం బస్టాండ్‌ ప్రాంతంలో 55 ఏళ్ల పురుషుడు మృతిచెంది ఉన్నాడని కార్తీకి సమాచారం అందింది. అక్కడకు వెళ్లి చూడగా, ముఖం గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో వంటిపై ఉన్న ఆధారాలను బట్టి తన తండ్రి మూర్తి అని నిర్ధారించుకున్న కార్తీ, పోలీసుల అంగీకారంతో మృతదేహాన్ని తురయంపాళయానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించాడు. ఈ క్రమంలో, సోమవారం రాత్రి ఇంటికి తిరిగొచ్చిన మూర్తి, తాను పని కోసం కర్ణాటకకు వెళ్లినట్లు పేర్కొన్నాడు. దీంతో, కుటుంబసభ్యులు, బంధువులతో పాటు గ్రామస్తులు నిర్ఘాంతపోయి, కొద్ది క్షణాల అనంతరం ఆనందంలో మునిగిపోయారు.

Updated Date - 2022-04-06T15:32:57+05:30 IST