HYD : డబ్బులు తీసుకొస్తానని భార్యకు చెప్పి బయటికెళ్లిన భర్త.. కారు వెనక సీటులో కూర్చోబెట్టి..!
ABN , First Publish Date - 2021-10-24T16:47:48+05:30 IST
డబ్బులు తీసుకురావడానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి తన మారుతి ఆల్టో కారులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు....
- గొంతు కోసి లారీ డ్రైవర్ హత్య
- శివారులో మృతదేహం పడేసే యత్నం
హైదరాబాద్ సిటీ/హయత్నగర్ : కత్తితో గొంతు కోసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసి కారులో వదిలి వెళ్లిన సంఘటన హయత్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కర్ణాటక గుల్బార్గా ఫెరోజాబాద్కు చెందిన ముస్తాక్ పటేల్(45) 20 సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి సైదాబాద్ జహంగీర్నగర్లో ఉంటున్నాడు. ముస్తాక్ పటేల్ లారీ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఫిర్థోస్బేగంతో పాటు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఆయనకు మద్యం, జూదం అలవాటు. మద్యం మత్తులో ఉన్న ముస్తాక్ పటేల్ శుక్రవారం సాయంత్రం డబ్బులు తీసుకురావడానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి తన మారుతి ఆల్టో కారులో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. గుర్తు తెలియని దుండగులు శుక్రవారం అర్ధరాత్రి ముస్తాక్ పటేల్ కంట్లో ఎండుకారం చల్లి కారు వెనక సీటులో కూర్చోబెట్టి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని హయత్నగర్ శివారు ప్రాంతంలో పడేసేందుకు అతడి కారులోనే హయత్నగర్ రేడియో స్టేషన్ వద్దకు వచ్చారు. దుండగులు కారును విజయవాడ జాతీయ రహదారి పక్కన రాజస్థానీలు మట్టి విగ్రహాలు తయారు చేసే గుడారం ముందు నిలిపి పారిపోయారు.
శనివారం ఉదయం రాజస్థానీ కళాకారులు కారులో శవాన్ని గుర్తించారు. వారు వెంటనే హయత్నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్క్వాడ్ను రప్పించి, వేలి ముద్రలను సేకరించారు. మృతుడి జేబులో లభించిన డైవింగ్ లైసెన్స్, భార్య ఫోన్ నంబర్, లారీ యజమాని ఫోన్ నంబర్ ఆధారంగా లారీ డ్రైవర్ ముస్తాక్ పటేల్గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి మహ్మద్పటేల్ ఫిర్యాదు మేరకు హయత్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులను పట్టుకోవడానికి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసినట్లు హయత్నగర్ సీఐ సురేందర్ తెలిపారు.