Live-In Parterను చంపి, ఆపై పోలీసులకు ఫోన్ కొట్టి...
ABN , First Publish Date - 2022-06-04T20:48:39+05:30 IST
తనతో కలిసి ఉంటూ తనను మోసం చేస్తోందని అనుమానించిన ఓ 22 ఏళ్ల యువతిని ఒక యువకుడు కత్తితో గొంతుకోసి
గురుగామ్: తనతో కలిసి ఉంటూ తనను మోసం చేస్తోందని అనుమానించిన ఓ 22 ఏళ్ల యువతిని ఒక యువకుడు కత్తితో గొంతుకోసి చంపాడు. ఆపై పోలీసులకు నేరుగా ఫోన్ కొట్టి అరెస్టయ్యాడు. తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ కిరాతక ఘటన గురుగావ్లోని రథివాస్ గ్రామంలో శనివారం ఉదయం జరిగింది. నిందితుడే హత్యకు సంబంధించిన సమాచారం ఇవ్వడంతో వెంటనే అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేశామని తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం, హతురాలు హర్యానాలోని పావల్ జిల్లాకు చెందినది. నిందితుని 25 ఏళ్ల రాహుల్ అలియాస్ సోనుగా గుర్తించారు. అతడు హర్యానాలోని రేవారీ జిల్లాకు చెందిన వాడు. సదరు మహిళ మూడేళ్ల క్రితం తన భర్త నుంచి వేరుపడి సోనుతో సహజీవనం చేస్తోంది. ఆ ఇద్దరూ తొలుత రేవారి జిల్లాలో జీవనం సాగించి కొద్దిరోజుల క్రితమే గురుగావ్లోని ఓ అద్దె ఇంటికి మారారు. వృత్తిరీత్యా పెయింటర్ అయిన సోను శనివారం ఉదయం 8 గంటలకు పోలీసులకు ఫోను చేసిన తనతో సహజీవనం సాగిస్తున్న మహిళను హత్య చేసినట్టు సమాచారం ఇచ్చాడు. ఆమె మెడపై మూడుసార్లు కత్తితో పొడిచి మరీ సోను ఈ హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునే సరికి ఆమె రక్తపు మడుగులో పడి ఉండగా, మృతదేహం పక్కనే సోను కూర్చుని ఉన్నాడు. వెంటనే అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. తనను మోసం చేస్తోందనే అనుమానంతో అతను నిలదీయడంతో ఇద్దరి మధ్యా ఉదయం పోట్లాట జరిగిందని, దాంతో కిచెన్ నైఫ్ (kitchen knife)తో ఆమెను సోను పొడిచి చంపాడని, అతని నుంచి మరింత సమాచారం రాబడుతున్నామని బిలాస్పూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) ఇన్స్పెక్టర్ అజయ్ మాలిక్ చెప్పారు.