40 పైసల కోసం కోర్టుకు వెళ్లాడు.. చివరకు రూ.4000 నష్టపరిహారం చెల్లించాడు!

ABN , First Publish Date - 2022-03-17T20:21:23+05:30 IST

చిన్న చిన్న విషయాలను సీరియస్‌గా తీసుకోకూడదని, కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేస్తేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు.

40 పైసల కోసం కోర్టుకు వెళ్లాడు.. చివరకు రూ.4000 నష్టపరిహారం చెల్లించాడు!

చిన్న చిన్న విషయాలను సీరియస్‌గా తీసుకోకూడదని, కొన్ని విషయాలను చూసి చూడనట్టు వదిలేస్తేనే మంచిదని పెద్దలు చెబుతుంటారు. అయితే బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి చిన్న విషయాన్ని సీరియస్‌గా తీసుకుని భారీ మూల్యం చెల్లించాడు. కేవలం 40 పైసల కోసం కోర్టుకు వెళ్లి నాలుగు వేల రూపాయల జరిమానా చెల్లించాడు. 


 బెంగళూరు సెంట్రల్ స్ట్రీట్‌లోని ఉన్న హోటల్ ఎంపైర్‌కు గతేడాది మే నెలలో మూర్తి అనే వ్యక్తి వెళ్లాడు. టిఫిన్ ప్యాక్ చేయించుకుని రూ.265 చెల్లించాడు. అయితే బిల్లు రూ.264.60 మాత్రమే అయిందని, మిగిలిన 40 పైసలు ఇవ్వాలని రెస్టారెంట్ సిబ్బందిని అడిగాడు. ఈ నేపథ్యంలో రెస్టారెంట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. వారు 40 పైసలు తిరిగి ఇవ్వకపోవడంతో ఏకంగా వినియోగదారుల కోర్టులో కేసు వేశాడు. ఈ సంఘటన కారణంగా తాను మానసిక వేదన అనుభవించానని, తనకు ఒక రూపాయి పరిహారం ఇవ్వాలని కోర్టులో విజ్ఞప్తి చేశాడు. 


ఈ కేసును విచారించిన కోర్టు మూర్తికి షాకిచ్చింది. రెస్టారెంట్ న్యాయవాది మాట్లాడుతూ.. ``సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ యాక్ట్ 2017` ప్రకారం, చిల్లర ఇవ్వడం కుదరనపుడు దానిని సమీప రౌండ్ ఫిగర్ అమౌంట్‌గా మార్చుకోవచ్చు. 50 పైసల కంటే ఎక్కువ బిల్లు అయితే దానిని ఒక రూపాయిగానే పరిగణిస్తారు. అందువల్లే రెస్టారెంట్ 40 పైసలు తిరిగి ఇవ్వలేద`ని చెప్పారు. కాగా, 40 పైసల కోసం కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు మూర్తికి న్యాయస్థానం రూ.4 వేలు జరిమానాగా విధించింది. 

Updated Date - 2022-03-17T20:21:23+05:30 IST