‘మన ఊరు-మనబడి’ పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-10-05T06:03:09+05:30 IST

జిల్లాలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.

‘మన ఊరు-మనబడి’ పనులను పూర్తి చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి 

సిరిసిల్ల కలెక్టరేట్‌, అక్టోబరు 4: జిల్లాలో మన ఊరు-మనబడి కార్యక్రమం కింద పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను రెండు వారాల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి ఆదేశించారు.  కలెక్టరేట్‌లో మన ఊరు-మనబడి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో మొదటి విడత కింద గంభీరావుపేటలో 15, వీర్నపల్లి 8, ఎల్లారెడ్డిపేట 14, ఇల్లంతకుటలో 17 పాఠశాలల్లో రూ.4.78 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఇందులో 7 పాఠశాలలు మినహా మిగతా వాటిలో పనులు ప్రారంభం అయ్యాయని తెలిపారు.   సివిల్‌ పనులను పెండింగ్‌లో పెట్టకుండా పూర్తి చేయాలన్నారు.   దీనిపై ఈ నెల 19న మరోసారి సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.  ఈ సమావేశంలో  ప్రధానోపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు. 

  గ్రూప్‌ 1 పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి 

- రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి 

 జిల్లాలో అక్టోబరు 16న నిర్వహించనున్న గ్రూప్‌ 1ప్రిలిమ్స్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు.  కలెక్టరేట్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్‌ నుంచి   గ్రూప్‌ 1 పరీక్షల ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 503 గ్రూప్‌ 1 పోస్టులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల 80 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారని ఈ పరీక్షలకు ఏలాంటి ఇబ్బందులు తలేత్తకుండా పరీక్ష కేంద్రాల్లో అన్నీ రకాల ఏర్పాట్లతో పాటు తాగునీరు, నీటిసరఫరా, మరుగుదొడ్లు, విద్యుత్‌ సరఫరా సీసీ కమెరాలను ఏర్పాటు చేయాలని అన్నారు. పరీక్షలకు బయోమెట్రిక్‌ ద్వారా హాజరు ఉంటుందని నిర్దేశిత సమయం కంటే ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని, పరీక్ష కేంద్రాల వద్ద పాటించాల్సిన నియమ నిబంధనల గురించి ప్రచారం చేయాలని అన్నారు. దీనికి సంబంధించిన చీప్‌ సూపరింటెండెంట్‌లు, రూట్‌ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, లైజన్‌ అఫీసర్లు, అసిస్టెంట్‌ లైజన్‌ అఫీసర్లను నియమించుకోవాలని అన్నారు. స్ట్రాంగ్‌రూంలను పరిశీలించి ప్రశ్నపత్రాల తరలింపును పోలీసుల పర్యవేక్షణలో జరగాలని ప్రతి అంశాన్నీ సీసీ కమెరాల్లో రికార్డు అయ్యేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 17 పరీక్ష కేంద్రాలలో 4268 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ రకాల వసతులను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఇంటర్మీడీయేట్‌ అధికారి మోహన్‌, ఎవో గంగయ్యలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-05T06:03:09+05:30 IST