ఈ నెల 14 చారిత్రాత్మకమైన రోజు
ABN , First Publish Date - 2021-09-17T05:28:01+05:30 IST
వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిన ఈనెల 14వ తేదీ అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథ్ అన్నారు.
- ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథ్
ఉండవల్లి, సెప్టెంబరు 16 : వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిన ఈనెల 14వ తేదీ అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు చారిత్రాత్మకమైన రోజు అని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి డాక్టర్ మందా జగన్నాథ్ అన్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డులో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని 2018లో అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తు చేశారు. దీంతో పాటు అలంపూర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు డిపో, ఫైర్స్టేషన్ ఏర్పాటు చేయాలని పలుమార్లు ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. వాటిని కూడా సీఎం కేసీఆర్ నెర వేర్చుతారని నమ్మకం ఉందని చెప్పారు. వంద పడకల ఆస్పత్రి ఏర్పాటుతో అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు వైద్యసేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. అలం పూర్ ఆస్పత్రిని కూడా దశల వారీగా అభివృద్ధి చేయనున్నామని, ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికే చర్యలు తీసుకుందని అన్నారు. ఆంధ్ర పాలకుల దురాలో చనలతో నీటి సమస్య మరింత జటిలం అయ్యిందని విమర్శించారు. కృష్ణా, గోదావరి నదుల నుంచి మనకు రావాలసిన వాటాలో చుక్కనీటిని కూడా వదులుకోబోమని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పారని, దీనిపై వారు కృత నిశ్చయంతో ఉన్నారని చెప్పారు. వరి సాగులో దేశంలోనే తెలంగాణ ముందు వరసలో ఉందని, నేడు ధాన్యం కోనుగోలు విషయంలో కేంద్రం మెలికలు పెట్టడం మంచిది కాదన్నారు. అన్ని రంగాలలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అలంపూర్ మాజీ ఇన్చార్జి మందా శ్రీనాథ్, సీనియర్ నాయకులు వడ్డేపల్లి శ్రీనివాసులు, పల్లెపాడు శంకర్ రెడ్డి, అంజి, కలుకుంట్ల సర్పంచు ఆత్మలింగారెడ్డి, అమరవాయి ఎంపీటీసీ సభ్యుడు రోషన్న, నాయకులు శ్రీకాంత్, మహేష్ గౌడు, సురేంద్ర, దానం, అశోక్ బాబు, ధర్మ తదితరులు పాల్గొన్నారు.