మందుబాబు వీరంగం
ABN , First Publish Date - 2021-07-25T06:14:19+05:30 IST
పట్టణంలోని డేనియల్ పురం గేటు సమీపంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం చేశాడు.
- మత్తులో పలువురిపై దాడి
- కేసు నమోదు చేసిన పోలీసులు
నంద్యాల (ఎడ్యుకేషన్), జూలై 24: పట్టణంలోని డేనియల్ పురం గేటు సమీపంలో రామసుబ్బారెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో వీరంగం చేశాడు. వారించబోయిన ఓ వ్యక్తిపై దాడి చేశాడు. పోలీసులనూ దుర్భాషలాడాడు. నంద్యాల పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మద్యం మత్తులో అల్లరి చేస్తున్న రామసు బ్బారెడ్డిని అదే వీధిలోని ఓ ఫైనాన్స్ షాపు యజమాని రవీంద్రారెడ్డి వారించబోయాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రెచ్చిపోయిన రామసుబ్బారెడ్డి ఫైనాన్స్ షాపులోకి వెళ్లి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశాడు. అడ్డుకున్న రవీంద్రారెడ్డిపై, స్థానికులపై దాడి చేశాడు. విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రామసుబ్బారెడ్డిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. మద్యం మత్తులో ఉన్న రామసుబ్బారెడ్డి పోలీసులను దుర్భాషలాడుతూ చిందులేశాడు. దీంతో వారు రామసుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్కు తరలించారు. గాయపడిన రవీంద్రారెడ్డిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఐపీసీ 452, 427, 323, 324 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.