Nara Lokesh: సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవని కేంద్రం ఏర్పాటు
ABN , First Publish Date - 2022-08-17T00:20:29+05:30 IST
మంగళగిరిలో సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవని పేరిట ఉచిత వైద్య కేంద్రాన్ని...
అమరావతి (Amaravathi): మంగళగిరి (Mangalagiri)లో సొంత ఖర్చుతో ఆరోగ్య సంజీవని (Arogya Sanjeevani) పేరిట ఉచిత వైద్య కేంద్రాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రారంభించారు. ఈ వైద్య కేంద్రం ద్వారా మంగళగిరి నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించనున్నారు. ఈ ఆరోగ్య కేంద్రానికి అత్యాధునిక చికిత్సా పరికరాలు, పరీక్ష యంత్రాలు, ఎమర్జెన్సీకి అవసరమైన సామాగ్రిని తన సొంత ఖర్చులతో నారా లోకేశ్ సమకూర్చారు. చిన్న సమస్యలకు ఆస్పత్రుల చుట్టూ తిరగలేని, డబ్బు ఖర్చు చేయలేని నిరుపేదలు, నియోజకవర్గంలో గ్రామీణుల కోసం ఈ సంజీవని ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కేంద్రంలో ఒక జనరల్ ఫిజిషియన్ అయిన డాక్టర్, క్వాలిఫైడ్ ఫార్మసిస్ట్, ఫిమేల్ నర్స్, కాంపౌండర్ ఉంటారు. ఆరోగ్య కేంద్రంలోనే 200కి పైగా రోగనిర్దారణ పరీక్షలు కూడా పూర్తిగా ఉచితంగా చేసే ఏర్పాటు చేశారు. అవసరమైనవారికి మందులు కూడా ఉచితంగా అందచేయనున్నారు. అందరికీ ఆరోగ్యమస్తు- ప్రతీ ఇంటికీ శుభమస్తు అనే నినాదంతో ఈ ఆరోగ్య కేంద్రాన్ని నారా లోకేశ్ అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. మంగళగిరి ప్రజల ప్రతి ఒక్కరి ఆరోగ్య డేటా పర్యవేక్షించేలా తెలుగుదేశం పని చేస్తుందన్నారు. మంగళగిరిలో విజయవంతం అయిన కార్యక్రమాలు అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని లోకేశ్ తెలిపారు.