Delhi liquor policy: ఏమిటి ఈ నాటకం : మనీశ్ సిసోడియా

ABN , First Publish Date - 2022-08-21T15:51:31+05:30 IST

ఎక్సయిజ్ విధానం (Excise Policy) అమలులో అక్రమాలకు

Delhi liquor policy: ఏమిటి ఈ నాటకం : మనీశ్ సిసోడియా

న్యూఢిల్లీ : ఎక్సయిజ్ విధానం (Excise Policy) అమలులో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. తనకు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ-CBI) లుక్ఔట్ సర్క్యులర్‌ను జారీ చేయడంపై మండిపడ్డారు. 


ఎక్సయిజ్ పాలసీ అమలులో అక్రమాలకు సంబంధించిన కేసులో నిందితులు దేశం విడిచి వెళ్ళకుండా నిరోధించేందుకు సీబీఐ మనీశ్ సిసోడియాతో పాటు మరో 13 మందిపై లుక్ఔట్ సర్క్యులర్లను ఆదివారం జారీ చేసింది. వీరందరినీ ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. లుక్ఔట్ సర్క్యులర్ జారీ అయితే నిందితులు విదేశాలకు వెళ్ళడానికి వీలుండదు. ఈ నిబంధనను ఉల్లంఘించినవారిని అరెస్టు చేయవచ్చు. 


ఈ నేపథ్యంలో మనీశ్ సిసోడియా స్పందిస్తూ ఇచ్చిన ట్వీట్‌లో, ప్రధాన మంత్రి మోదీని ఉద్దేశించి, ‘‘ఏమిటి ఈ నాటకం?’’ అని నిలదీశారు. 


ఢిల్లీ రాష్ట్ర ఎక్సయిజ్ విధానం 2021-22కు సంబంధించి మనీశ్ సిసోడియా, ప్రభుత్వ అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు సీబీఐ కేసు నమోదు చేసింది. టెండర్ల తర్వాత లైసెన్స్ పొందినవారికి అనుకూలంగా అనుచిత ప్రయోజనాలను కల్పించేందుకు వీలుగా, తగిన అధికారాలుగల అధికారి అనుమతి లేకుండా వీరు ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించింది. ఈ ఎక్సయిజ్ విధాన రూపకల్పన, అమలులో జరిగిన అక్రమాలతో ప్రమేయంగల లిక్కర్ వ్యాపారుల్లో సమీర్ మహేంద్రు ఒకరని తెలిపింది. సమీర్ ఇండోస్పిరిట్ కంపెనీ యజమాని అని పేర్కొంది. మనీశ్ సిసోడియాకు అత్యంత సన్నిహితులకు రెండుసార్లు కోట్లాది రూపాయలను సమీర్ చెల్లించినట్లు వివరించింది. 


ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ కొందరు నిందితులకు శనివారం సమన్లు జారీ చేసింది. వీరిలో కొందరు మనీశ్ సిసోడియాకు అత్యంత సన్నిహితులని తెలుస్తోంది. 


Updated Date - 2022-08-21T15:51:31+05:30 IST