‘ముసురు’కున్న మన్యం

ABN , First Publish Date - 2022-07-06T06:10:38+05:30 IST

కొన్ని రోజులుగా మన్యాన్ని ముసురు వదలడం లేదు. సుమారు పది రోజులుగా ఏజెన్సీలో నిత్యం ఏదో చోట వర్షం కురుస్తూనే ఉంది.

‘ముసురు’కున్న మన్యం
పాడేరు అంబేడ్కర్‌ సెంటర్‌లో వర్షం

ఏజెన్సీలో పది రోజులుగా కొనసాగుతున్న వాన


పాడేరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): కొన్ని రోజులుగా మన్యాన్ని ముసురు వదలడం లేదు. సుమారు పది రోజులుగా ఏజెన్సీలో నిత్యం ఏదో చోట వర్షం కురుస్తూనే ఉంది. రెండు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మంగళవారం సైతం ఏజెన్సీలో అక్కడక్కడ వర్షం కురిసింది. జిల్లా కేంద్రం పాడేరులో మంగళవారం ఉదయం ఒక మోస్తరుగా జల్లులతో కూడిన వర్షం కురిసింది. పది గంటల తరువాత తెరిపి ఇచ్చినప్పటికీ ఎండ కాయలేదు. ఆకాశం మబ్బులతో ముసురు వాతావరణం కొనసాగింది. తాజా వర్షానికి రోడ్లు తడిసి ముద్దయ్యాయి. ముంచంగిపుట్టు, పెదబయలు, హుకుంపేట, డుంబ్రిగుడ మండలాల్లో ఉదయం ఒక మోస్తరు వర్షం కురిసింది. జి.మాడుగుల, చింతపల్లి, జీకేవీధి ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగింది.

ముంచంగిపుట్టు: మండల పరిధిలో మంగళవారం ఉదయం వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి వర్షం కాస్త తెరిపి ఇచ్చింది. వాగులు వరదనీటితో కళకళలాడుతున్నాయి. రహదారులు చిత్తడిగా మారాయి. మారుమూల గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు పలు చోట్ల దెబ్బతిన్నాయి. అటుగా రాకపోకలు సాగించేందుకు వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.

సీలేరు: జీకేవీధి మండలం సీలేరులో మంగళవారం ఒక మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు వర్షం కురిసింది. 

Updated Date - 2022-07-06T06:10:38+05:30 IST