పోలీసుల అదుపులో మావోయిస్టులు!
ABN , First Publish Date - 2022-01-23T05:22:22+05:30 IST
పోలీసుల అదుపులో మావోయిస్టులు!
వికారాబాద్, జనవరి 22 : వికారాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరిని కరీంనగర్ పోలీసులు మావోయిస్టులుగా అనుమానిస్తూ అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. నవాబుపేట మండలం గంగ్యాడకు చెందిన నాగభూషణంతో పాటు వికారాబాద్ మండలం మద్గుల చిట్టంపల్లికి చెందిన గోపాల్ను పక్కా సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరికీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతోనే కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. వీరి ప్రమేయంతోనే కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండయ్యపల్లికి చెందిన పెయింటర్ మల్యాల సురేష్ మావోయిస్టు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఛత్తీస్గడ్ అటవీ ప్రాంతంలో జరిగిన సమావేశాలకు హాజరైనట్లు తెలిసింది. ఈక్రమంలో కరీంనగర్ పోలీసులు సురేష్ను అరెస్ట్చేసి విచారణ చేయగా, వికారాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరి వ్యవహారం బహిర్గతం కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఈ విషయంలో స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేదన్నట్లుగా తెలుస్తోంది.