మార్కెట్ విలువలకు నేడు ఆమోదం
ABN , First Publish Date - 2020-08-09T10:56:22+05:30 IST
జిల్లాలో రిజిస్టే్ట్రషన్లు- స్టాంపుల శాఖ పెంచిన మార్కెట్ విలువలకు ఆదివారం ఆమోదముద్ర పడనుంది.
ఐదు నుంచి 10 శాతం పెంపు
మార్కెట్ విలువల కమిటీ ముందుకు ఫైల్
10 నుంచి అమలు
నెల్లూరు(హరనాథపురం); ఆగస్టు 8 : జిల్లాలో రిజిస్టే్ట్రషన్లు- స్టాంపుల శాఖ పెంచిన మార్కెట్ విలువలకు ఆదివారం ఆమోదముద్ర పడనుంది. కరోనా కష్ట కాలంలో ఆ శాఖ 5 నుంచి 10 శాతం వరకు మార్కెట్ విలువలను పెంచి ప్రజలపై భారం మోపింది. పెంచిన విలువలపై అభ్యంతరాలు తెలుపుకునేందుకు ఆ శాఖ ఇటీవల అవకాశం కల్పించింది. వెబ్సైట్లో పెంచిన వివరాలను ఉంచింది. అభ్యంతరాల స్వీకరణ కూడా పూర్తి కావటంతో కమిటీ అందుకు ఆదివారం ఆమోదం తెలుపనుంది. పెంచిన విలువలు ఈనెల 10వ తేదీ నుంచి అమలులోకి వస్త్తాయి. ఖరీదైన, ధరతక్కువ ఉన్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని విలువలను పెంచారు. ఈ సారి పెంపును అత్యవసరంగా చేపట్టారు. గతనెల 25న మార్కెట్ విలువల పెంపునకు సంబంధించి ఆ శాఖ నుంచి సబ్రిజిస్ట్రార్లకు ఉత్తర్వులు వచ్చాయి.
దీంతో వారు ఆగమేఘాల మీద పెంపు పక్రియను పూర్తి చేశారు. పెంపు ప్రతిపాదనలు కష్టతరమైనా కేవలం ఆరు రోజుల వ్యవధిలో పూర్తి చేశారు. పెంచిన మార్కెట్ విలువలకు మార్కెట్ విలువల పెంపు కమిటీ ఆదివారం ఆమోదం తెలుపుతుందని రిజిస్ట్రేషన్లు - స్టాంపులు శాఖ డీఐజీ కే. అబ్రహం తెలిపారు. పెంచిన విలువలపై అభ్యంతరాల తరువాత తుది జాబితాను మార్కెట్ విలువల పెంపు కమిటీ ముందు ఉంచుతాం. ఆమోదం తరువాత పెంచిన వివరాలను తెలుపుతామని చెప్పారు.