అదనపు కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-19T06:23:58+05:30 IST

అదనపు కట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త వేధింపులు రోజురోజుకు తీవ్రమవుతుండడంతో తనువు చాలించడమే ఉత్తమమని భావించి, ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు దారంతో ఉరి వేసుకుంది.

అదనపు కట్న వేధింపులతో వివాహిత ఆత్మహత్య
ఉరివేసుకొని ఫ్యానుకు వేలాడుతున్న రేఖ మృతదేహం

గంగవరం, మే 18: అదనపు కట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... గంగవరం మండలంలోని  పలమనేరు మండలం గుండ్లపలెకు చెందిన రేఖకు గంగవరం మండలం మబ్బువాళ్లపేటవాసి శివకు 2016లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వివాహ సమయంలో  రూ.25 వేలు, 100 గ్రాముల బంగారు ఆభరణాలు ఇచ్చారు. శివ స్థానికంగా కూలీ పనులు చేసుకొని జీవనం సాగించేవాడు. వీరికి  కుమారుడు, కుమార్తె  కలిగారు. అయితే ఇటీవల కొద్దిరోజుల నుంచి శివ మద్యానికి బానిసై భార్యపై అనవసరంగా దాడి చేయడం, అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేసి హింసించేవాడు. తల్లిదండ్రులకు చెబితే అవమానంతో పాటు వారికి మనశ్శాంతి ఉండదని లోలోపలే కుమిలిపోతూ ఉండేది. ఈ క్రమంలో మంగళవారం రాత్రికూడా పూటుగా మద్యం తాగి వచ్చిన శివ, భార్య రేఖ ను అనవసరంగా దూషించి చితకబాదాడు. భర్త వేధింపులు రోజురోజుకు తీవ్రమవుతుండడంతో తనువు చాలించడమే ఉత్తమమని భావించి, ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో మరో గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు దారంతో ఉరి వేసుకుంది. బుధవారం వేకువజామున కుటుంబీకులు  గమనించగా రేఖ అప్పటికే మృతి చెందింది. సమాచారం అందుకున్న గంగవరం ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని మృతికి గల కారణాలపై విచారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన్నట్లు  ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2022-05-19T06:23:58+05:30 IST