పెళ్లి తర్వాత జీవితం ఊహించినట్టుగా లేదని.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువతి!

ABN , First Publish Date - 2021-07-22T16:45:30+05:30 IST

పెళ్లి తర్వాత జీవితం రంగుల కలలా ఉంటుందని ఆశలు పెట్టుకుంది..

పెళ్లి తర్వాత జీవితం ఊహించినట్టుగా లేదని.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న యువతి!

పెళ్లి తర్వాత జీవితం రంగుల కలలా ఉంటుందని ఆశలు పెట్టుకుంది.. తీరా పెళ్లయ్యాక ఆమె కలలు కల్లలుగానే మిగిలాయి.. భర్తతో నిత్యం గొడవలే.. ఈ గొడవలు రానురానూ ముదరడంతో ఆమె షాకింగ్ నిర్ణయం తీసుకుంది.. జీవితం మీద అసంతృప్తితో ఆత్మహత్య చేసుకుంది.. కర్ణాటకలోని మైసూరులో ఈ ఘటన బుధవారం జరిగింది. 


మైసూరులోని హున్సూర్ తాలూకాకు చెందిన పల్లవి అనే యువతికి ఏడాది క్రితం వివాహమైంది. కొన్నాళ్లు పాటు ఆమె కాపురం సంతోషంగానే సాగింది. అయితే ఆరు నెలల తర్వాత ఆ కాపురంలో కలతలు రేగాయి. ఈ గొడవలు రానురానూ పెరిగిపోవడంతో భార్యాభర్తలిద్దరూ శత్రువుల్లా మారిపోయారు. ఈ గొడవల కారణంగా పల్లవి కొన్నాళ్లు పుట్టింటికి వెళ్లిపోయింది. అయితే.. ఇరు కుటుంబాల పెద్దలూ రాజీ కుదర్చి ఇద్దరినీ కలిపారు. అయితే ఆ ముచ్చట ఎంతోకాల సాగలేదు. 


మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లారు. పెళ్లి తర్వాత జీవితం తను ఊహించినట్టుగా లేదని, భర్త తనను వేధిస్తున్నాడని స్నేహితులతో చెప్పుకుని పల్లవి బాధపడుతుండేది. కాగా, గత మంగళవారం ఈ ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరిగింది. పల్లవితో తీవ్రంగా గొడవపడిన భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడు తిరిగి వచ్చేసరికి పల్లవి ఇంట్లో ఉరేసుకుని చనిపోయింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు పల్లవి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పల్లవి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2021-07-22T16:45:30+05:30 IST